హైదరాబాద్‌కు గ్యాస్ కష్టం.. ఇరానీ చాయ్ ‘ఖలాస్’.. బిర్యానీ ‘నిల్’!

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-14 05:20:00  IST  )

హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటల్ రంగం కుదేలైంది. ఫేమస్ బిర్యానీ సెంటర్లు, ఇరానీ చాయ్ హోటళ్లు మూతపడుతున్నాయి.

హైదరాబాద్‌కు గ్యాస్ కష్టం.. ఇరానీ చాయ్ ‘ఖలాస్’.. బిర్యానీ ‘నిల్’!
X

దిశ, వెబ్‌డెస్క్: విశ్వనగరం హైదరాబాద్ (Hyderabad) అంటేనే దేశవిదేశాల నుంచి వచ్చే ఫుడ్ లవర్స్‌కు స్వర్గధామం. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. నగరంలో ఏర్పడిన తీవ్రమైన గ్యాస్ సిలిండర్ల సంక్షోభం హోటల్ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. నాలుగు రోజుల క్రితం వరకు వేలాది మంది కస్టమర్లతో కిటకిటలాడిన హోటళ్లు మూతపడుతున్నాయి. ఇక మొబైల్, తోపుడు బండ్లపై ఉన్న టిఫిన్ సెంటర్లు కంటికి కూడా కనబడటం లేదు. దీంతో ప్రజలు ఉదయాన్నే చెప్పులరిగేలా పట్నం అంతా తిరిగినా అల్పాహరాలు దొరక్క అల్లాడుతున్నారు.

హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు..

ఎల్‌పీజీ (LPG) కొరత ప్రభావం ముఖ్యంగా నగర పరిధిలోని SR నగర్, మధురానగర్, ఎల్లారెడ్డి గూడ వంటి ప్రాంతాల్లోని హాస్టళ్లపై పడింది. ఉద్యోగ, ఉపాధి కోసం వచ్చిన లక్షలాది మంది యువతకు ఇప్పుడు తిండి తిప్పలు తప్పడం లేదు. ఐటమ్స్ మెనూ నుంచి దోశ, పూరి, చపాతి మాయమయ్యాయి. కేవలం ఇడ్లీ, లెమన్‌ రైస్‌, పెరుగన్నం మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటికే చాలా కర్రీ పాయింట్లు ఇప్పటికే మూతపడగా, ఐటీ కారిడార్‌లోని క్యాంటీన్లు కూడా క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది.

బిర్యానీ నుంచి పచ్చడి మెనూ వరకు..

నగరంలోని ఫేమస్ బిర్యానీ హోటళ్లు కూడా వంట గ్యాస్ అందుబాటులో లేక విలవిల్లాడుతున్నాయి. సికింద్రాబాద్, టోలీచౌకీ వంటి ప్రాంతాల్లో రోజుకు 5 వేల బిర్యానీలు అమ్మే హోటళ్లు ఇప్పుడు కనీసం 500 కూడా వండలేని స్థితికి చేరుకున్నాయి. గ్యాస్ దొరకక చేసేది లేక చాలా చోట్ల కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా మెనూలో భారీ కోతలు విధించారు. 8 రకాల కూరలు వండే మెస్‌లలో కేవలం మూడంటే మూడు రకాల కూరలు, ఒక రోటి పచ్చడితోనే భోజనాన్ని ముగిస్తున్నారు. ఇక పేరుగాంచిన ప్రధాన మెస్‌ల రోజు ఆదాయం గతంలో రోజుకురూ.80 వేలు ఉండగా.. అది ఇప్పుడు ఏకంగా రూ.20 వేలకు పడిపోయింది. గ్యాస్ సంక్షోభం వల్ల వ్యాపారం నాలుగో వంతుకు పడిపోవడంతో వర్కర్లకు కనీసం జీతాలైనా ఇవ్వలేని పరిస్థితి ఉందని యజమానులకు కంటనీరు పెడుతున్నారు.

బోసిపోయిన ఇరానీ చాయ్ హోటళ్లు..

ఇక పవిత్ర రంజాన్ మాసం కావడంతో ముస్లిం సోదరులు ఎంతో ఇష్టపడే ఇరానీ చాయ్ (Irani Tea) కూడా ఇప్పుడు కరువైంది. దాదాపు 70 శాతం టీ స్టాళ్లు బంద్ కావడంతో భాగ్యనగర సంస్కృతిలోని ఒక ముఖ్యమైన భాగం ఆగిపోయినట్లయింది. గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి రాకపోతే నగరం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

గ్యాస్ కొరత లేదంటున్న సర్కార్.. అయినా ఏజెన్సీల వద్ద జనం క్యూ!

Next Story