గ్యాస్ కొరత లేదంటున్న సర్కార్.. అయినా ఏజెన్సీల వద్ద జనం క్యూ!

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-14 01:43:48  IST  )

తెలంగాణలో జనానికి గ్యాస్ సిలిండర్ల కొరత భయం పట్టుకుంది ప్రభుత్వం నిల్వలు ఉన్నాయని చెబుతున్నా ఆన్‌లైన్ బుకింగ్స్ కాకపోవడంతో ఏజెన్సీల వద్ద జనం బారులు తీరుతున్నారు.

గ్యాస్ కొరత లేదంటున్న సర్కార్.. అయినా ఏజెన్సీల వద్ద జనం క్యూ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్​కొరత వస్తుందనే అపోహతో జనం సిలిండర్లు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల వద్ద ఖాళీ సిలిండర్లలతో బారులు తీరుతున్నారు. వంట గ్యాస్‌ కొరత లేదని ప్రభుత్వం ప్రకటించినా పట్టించుకోవడం లేదు. తాజాగా అవసరం లేకున్నా భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని భావిస్తూ డబుల్​సిలిండర్ల వినియోగదారులంతా బుకింగ్ చేసుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం నిజంగా గ్యాస్​అవసరం ఉన్న వారికి దొరకడం లేదు. బ్లాక్‌లో సిలిండర్‌కు రూ.200 అదనంగా ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నట్లు పౌరసరఫరాల శాఖకు ఫిర్యాదులు అందడంతో ప్రతి జిల్లాలో నాలుగు బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, జగిత్యాల, సూర్యాపేటలో రెండు రోజులుగా వెయ్యి సిలిండర్లు పట్టుబడినట్లు అధికారులు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.29 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లుండగా 810 ఏజెన్సీల ద్వారా రోజు 2.25 లక్షల గ్యాస్​సిలిండర్ల సరఫరా జరుగుతున్నది. అదే విధంగా వాణిజ్య అవసరాలకు 23,459 సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. ఎల్పీజీ స్టాక్ 10,611 మెట్రిక్​టన్నులు, సిలిండర్లు 6,97,937 ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కనెక్షన్లలో 86 శాతం డొమెస్టిక్ ఉండగా, 14 శాతం మాత్రమే కమర్షియల్‌కి వాడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఎల్పీజీ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.114 పెంచారు. మరోపక్క ఎల్పీజీ, సీఎన్జీ కోసం ఫిల్లింగ్ స్టేషన్లలో ఆటోలు గంటల తరబడి భారీ క్యూ కడుతున్నాయి. ముందు క్యూలో నిలిచినవారికే దొరకగా చివరిగా వచ్చిన వారు నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది.

ఆన్‌లైన్ బుకింగ్ బంద్

గ్యాస్ సిలిండర్లను ప్రతిసారి వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా బుకింగ్​చేసుకునేవారు. మూడు రోజులుగా ఆయా కంపెనీలకు చెందిన ఆన్‌లైన్​ఫోన్ నెంబర్ పనిచేయడం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా బుకింగ్​కావడం లేదు. దీంతో వినియోగదారులు నిజంగా గ్యాస్​కొరత వస్తుందని ఉరుకులు పరుగులు పెడుతూ గ్యాస్​గోదాముల వద్ద క్యూ కడుతున్నారు. నిజంగా గ్యాస్ నిల్వలు సరిపడా ఉంటే ఆన్‌లైన్​బుకింగ్ ఎందుకు కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో అలజడి రాకుండా, ప్రభుత్వంపై విమర్శలు రాకుండా సరిపడా నిల్వలు ఉన్నాయనే ప్రచారం చేస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. మొన్నటి వరకు ప్రతి బస్తీలో ఏదో ఒక గ్యాస్​సరఫరా చేసే ఆటోలు కనిపించేవి. ప్రస్తుతం వాటి జాడ లేకపోవడంతో జనాలకు మరింత అనుమానం పెరిగింది. గ్యాస్ ఉంటే ఎందుకు ఇంటింటికీ సరఫరా చేయడం లేదని నిలదీస్తున్నారు. ప్రజల అనుమానాలకు బలం చేకూర్చేలా ఏజెన్సీలు వ్యవహరించడంతో భవిష్యత్తులో గ్యాస్ కష్టాలు వస్తాయని గోదాముల వద్ద క్యూలో నిలిచి ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు.

భారీగా పెరిగిన కట్టెల అమ్మకాలు

గ్యాస్ కొరత కారణంగా రోజుకు నగరంలో 5 వేల కిలోల వరకు కట్టెల అమ్మకాలు జరుగుతున్నట్లు కట్టెల వ్యాపారులు చెబుతున్నారు. ఐదారు రోజుల క్రితం రోజుకు 5 నుంచి 12 క్వింటాళ్ల వరకు మాత్రమే అమ్ముడయ్యేవని, రెండు రోజుల నుంచి డిమాండ్ బాగా పెరిగిందని పేర్కొంటున్నారు. కట్టెల ధర గతంలో కిలో రూ.15 వరకు ఉండేదని, ప్రస్తుతం రూ.21కి అమ్మకాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ డిమాండ్ ఇదే విధంగా కొనసాగితే కట్టెల నిల్వలు కూడా తొందరగానే పూర్తవుతాయని చెబుతున్నారు. కట్టెలను హోటల్​నిర్వాహకులు, ఫంక్షన్లు, కేటరింగ్ ఆర్డర్లు తీసుకునే వారే కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. హోటళ్ల యాజమానులు తమకు ఉండే గిరాకీ పోకుండా కాపాడుకునేందుకు కష్టమైనా కట్టెల పొయ్యి వినియోగిస్తున్నామని, ఒకసారి గిరాకీ ఇతర హోటళ్లకు వెళ్లితే తాము వ్యాపారం కొనసాగించలేమని వాపోతున్నారు.

Next Story