కవిత పార్టీలో ఉంటే ఎంత.. పోతే ఎంత: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-02 13:03:35  IST  )

కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఎంత.. పోతే ఎంత అంటూ బీఆర్ఎస్ మహిళా నేత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు.

కవిత పార్టీలో ఉంటే ఎంత.. పోతే ఎంత: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
X

దిశ, వెబ్‌డెస్క్: కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఎంత.. పోతే ఎంత అంటూ బీఆర్ఎస్ మహిళా నేత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో సత్యవతి రాథోడ్‌తో పాటు టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్ర, నేతలు రజని సాయిచంద్, శీలా‌రెడ్డి, చారులత, నిరోషా తదితరులు ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా కవిత మాట్లాడుతున్న మాటలు చూశామని అన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. మూడు నెలలుగా కవిత తన తీరుతో పార్టీ‌కి ఎంతో నష్టం చేశారని ఆరోపించారు. ఆమే వ్యాఖ్యలు పార్టీ శ్రేణులకు ఇబ్బందులకు గురి చేశాయని అన్నారు. నేడు కవితను సస్పెండ్ చేస్తూ తమ పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయం అందరినీ, మరీ ముఖ్యంగా మహిళలను సంతోష పరిచిందని సత్యవతి రాథోడ్ కామెంట్ చేశారు.

ప్రజలే ముఖ్యమని కేసీఆర్ మరోసారి నిరూపించారు

పేగు బంధం కన్నా.. తనను నమ్ముకున్న కోట్లాది ప్రజలే ముఖ్యమంటూ కేసీఆర్ మరోసారి నిరూపించారని సత్యవతి రాథోడ్ అన్నారు. కార్యకర్తల కన్నా కుటుంబ సభ్యులు ఎక్కువ కాదనే విషయం మళ్లీ స్పష్టమైంందని అన్నారు. కవిత‌కు నచ్చజెప్పాలని చూసినా.. ఆమె వినకపోవడం వల్లే సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పార్టీ లైన్ దాటిటే ఎవరికైనా ఇదే శిక్ష అనే సందేశాన్ని కేసీఆర్ ఇచ్చారని తెలిపారు. పార్టీ అధినేత మళ్లీ జనాల్లోకి రావాలని బలంగా కొరుకుంటున్న తరుణంలో కవిత పార్టీని పలు రకాలుగా ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. హరీష్ రావు, కేటీఆర్‌లు కేసీఆర్‌కు కుడి ఎడమ భుజాల్లాంటి వారని అభివర్ణించారు. వారిద్దరిపై కవిత నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఇక పీసీ ఘోష్ కమిషన్ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని సెటైర్లు వేశారు. అసెంబ్లీ‌లో హరీష్ రావు ఒంటి‌చేత్తో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారని కొనియడారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హరీష్ రావు ప్రసంగాన్ని కొనియాడుతుంటే.. ఆయనను కవిత విమర్శించడంతో ఆమె ఏ లైన్లో ఉన్నారో అర్థం అవుతోందని సత్యవతి రాథోడ్ అన్నారు. కేసీఆర్ కూతురుగా కవితకు ఎక్కడికి వచ్చినా ప్రజలు ఘన స్వాగతం పలికారని సత్యవతి రాథోడ్ అన్నారు. కానీ, ఆ గౌరవాన్ని కవిత నిలుపుకోలేకపోయిందని తెలిపారు. పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంత అనే మాట మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. అందుకు సమాధానంగా పార్టీ కేడర్ కవిత ఉంటే ఎంత.. లేకపోతే ఎంత అంటూ సమాధానం ఇచ్చిందని అన్నారు.

కవిత తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు.. గొంగిడి సునీత

కేసీఆర్ తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గొంగిడి సునీత అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలంతా కేసీఆరే మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. పార్టీ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ తన ప్రసంగం‌లో సీఎం రేవంత్ రెడ్డి పేరు తీసుకోలేదని.. ఈ విషయం రేవంత్‌తో పాటు కవితకు కూడా నచ్చలేదని అన్నారు. ప్రజలు ఆమోదించేలా కవిత వ్యవహారం లేదని అన్నారు. కవిత కేసీఆర్‌ను ఏమని పిలుస్తుందో తెలియదు.. కానీ, తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను బాపు అంటారని గుర్తు చేశారు. కవిత తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని కామెంట్ చేశారు. కవిత పార్టీ పెడుతుందా.. పెట్టదా తమకు సంబంధం లేదని, ఒకవేళ పెట్టినా తమకు వచ్చిన నష్టమేమి లేదని గొంగిడి సునీత అన్నారు.

హరీశ్‌రావు మాటలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి.. మాలోతు కవిత

అసెంబ్లీ‌లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిన తీరు బీ‌ఆర్‌ఎస్‌లో శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని మాజీ ఎంపీ మాలోతు కవిత అన్నారు. ఆ ఉత్సాహాన్ని నీరుగార్చేందుకు కవిత‌తో కలిసి కొందరు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేలా చేశారని ఆరోపించారు. ఆమె మీద పార్టీ కార్యకర్తలు రగిలి‌పోయారని.. కవిత‌పై సస్పెన్షన్ వేటు వేయడాన్ని పార్టీలో అంతా హర్షిస్తున్నారని తెలిపారు. గతంలో సోషల్ మీడియా‌లో కవిత‌కు మంచి ఫాలోయింగ్ ఉండేదని.. ఆమె వ్యవహార శైలితో ఇప్పుడు అంతా ట్రోలింగ్‌గా మారిందని మాలోతు కవిత అన్నారు.


Read More..

హరీశ్‌‌రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న వంటేరు వీడియో

Next Story