Eatala Rajender: తన లక్ష్యం అదే.. బీజేపీలో సీఎం అభ్యర్థిపై ఈటల క్లారిటీ!

by Disha Web Desk |
Eatala Rajender Says, BJP Aimed to unseat CM KCR
X

దిశ, వెబ్‌డెస్క్ : Eatala Rajender Says, BJP Aimed to unseat CM KCR| సీఎం కేసీఆర్‌ను గద్దెదించడమే లక్ష్యంగా పని చేస్తున్న బీజేపీలో సీఎం క్యాండిడేట్ ఎవరన్నదానిపై జోరుగా చర్చ సాగుతోంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాడటంతో రాబోయే ఎన్నికల్లో తమ బలమేంటో నిరూపించుకునేందుకు బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీసింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో మిగతా పార్టీల్లో అలజడి రేగింది. ఈక్రమంలో బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ఉండబోతున్నారనే దానిపై రోజుకో ఊహజనిత ప్రచారం పుట్టుకు వస్తోంది. ఈ విషయంలో పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, ఈటల రాజేందర్ పేర్లు ప్రధానంగా ప్రచారం జరగడం బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠను రేపుతోంది. ఓ వైపు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తుంటే, ఆపరేషన్ ఆకర్ష్ బాధ్యతలను ఈటల రాజేందర్‌కు అప్పగించింది కమలం పార్టీ అధిష్టానం. దీంతో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారనే చర్చ జోరందుకుంది. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి విషయంలో ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు.

తన లక్ష్యం అదే: ఈటల

బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిని తానేనంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవొద్దని ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని ఎవరకి ఏ పని అప్పగించాలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఇక్కడ నాయకులు, కార్యకర్తలు పార్టీ నియమాలకు కట్టుబడి పనిచేస్తారని చెప్పారు. పదవులను ఎవరికి వారు నిర్ణయించుకోవడం బీజేపీలో సాధ్యం కాదని.. నేతల సామర్థ్యాలను బట్టి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ కొనసాగిస్తున్న నియంతృత్వ పాలనను అంతం చేయడమే తన లక్ష్యం అని పేర్కొన్నారు. తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయడానికి పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

ఈటల క్లారిటి వెనుక కారణం ఇదేనా?

నిజానికి ఈటల బీజేపీలో చేరిన నాటి నుండి ఆయనే సీఎం అభ్యర్థి అంటూ ఓ వర్గం ప్రచారం చేస్తోంది. ఈ ఇష్యూ కొనసాగుతుండగానే గజ్వేల్‌లో ముఖ్యమంత్రి పై పోటీ చేసి తప్పక ఓడిస్తానని ఈటల సవాల్ చేయడం బీజేపీలో మరోసారి చర్చకు కారణం అయింది. గజ్వేల్, హుజూరాబాద్ తో పాటు కేసీఆర్ ఎక్కడి నుండి పోటీ చేసిన తప్పక ఓడిస్తానని ఈటల చేసిన కామెంట్స్ పై బండి సంజయ్ పరోక్షంగా ఖండించారు. పార్టీలో ఎవరు ఎక్కడి నుండి పోటీ చేయాల్సింది నిర్ణయించేది అధిష్టానమని వ్యక్తులు తాము పోటీ చేయబోయే స్థానాలను నిర్ణయించుకోవడం కుదరదని స్పష్టం చేశారు. తనతో సహా అందరికీ ఈ రూల్ వర్తిస్తుందని బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. ఈక్రమంలో బీజేపీలోకి పెద్ద తలకాయలు చేరబోతున్నాయనే ప్రచారంతో ఈటల విషయంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కేసీఆర్‌ను గద్దెదించబోయేది ఈటలనేనని ఆయన ద్వారా టీఆర్ఎస్ కు భారీ గండి పడబోతోదనే ఊహజనిత ప్రచారం పెద్దఎత్తున జరుగుతోంది. అయితే ఓ వైపు బండి సంజయ్ పరోక్ష ఖండనలు కొనసాగుతుండగా మరో వైపు సీఎం అభ్యర్థి తానే అని తన విషయంలో జరుగుతున్న ప్రచారం మొదటికే మోసం చేస్తుందని గ్రహించిన ఈటల ఈ ప్రచారానికి ఎండ్ కార్డు వేయాలని తాజా ప్రకటన చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

కాంగ్రెస్‌లో ఉత్కంఠ రేపుతున్న సునీల్ కనుగోలు రిపోర్ట్


Next Story

Most Viewed