BRS : బీఆర్ఎస్‌లో వర్గ పోరు

by Disha Web Desk 21 |
BRS : బీఆర్ఎస్‌లో వర్గ పోరు
X

దిశ, కమలాపూర్: హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌లో వర్గపోరు నడుస్తోంది. అవినీతి ఆరోపణలపై ఈటలను మంత్రి పదవి నుంచి తొలగించడంతో ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయడం అందరికీ తెలిసిందే. అయితే అనంతరం నిర్వహించిన ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఈటల గెలిచిన విషయం విధితమే. అయితే ప్రస్తుతం కమలాపూర్ మండలంలో పార్టీ కార్యకర్తల మధ్య సఖ్యత లేక విభేదాలు తలెత్తుతున్నాయి. పార్టీ నేతల మధ్య వర్గపోరు ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో గెలవడం సాధ్యమేనా? అంటూ సొంత పార్టీ నాయకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సమక్షంలోనే కార్యకర్తలు ఒకరినొకరు దూషించుకున్నారు. ఆయన ఎంత చెప్పినా వినకుండా కుర్చీలు విసురుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడం ఆశ్చర్యపరిచింది. అంతేకాక ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరిన నాయకులు పాతవారిపై అజమాయిషి చలాయిస్తున్నారనే పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమను గుర్తించడం లేదని ఎవరికీ చెప్పుకోవాలో తెలియక కిందిస్థాయి నాయకులు మదనపడుతున్నారు.

తారాస్థాయికి గొడవులు:

ఇటీవల హుజురాబాద్ ఉప ఎన్నికల ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌‌తో కలిసి పనిచేసిన పార్టీ నాయకులు ఒక వర్గంగా, ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి వర్గం నాయకుల మధ్య వర్గపోరు నడుస్తోంది. ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గ పూర్తి బాధ్యతలు కౌశిక్ రెడ్డికి అప్పగించగా నియోజకవర్గంలో పర్యటిస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇటీవల పార్టీలో కొంతమంది నేతలు పార్టీ కోసం మనస్ఫూర్తిగా పనిచేయడం లేదంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈటల గెలిచినప్పుడు కూడా కొంతమంది ముఖ్యనాయకులు ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే కొందరు ఒక పార్టీ జెండా పట్టుకుని ఇంకో పార్టీ కోసం పనిచేస్తూ సొంత పనిచేస్తున్నామంటూ చెప్పుకుంటూ పార్టీలో కొనసాగుతున్నారని ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటుండడంతో గొడవలు తారాస్థాయికి చేరాయనే పలువురు చర్చించుకుంటున్నారు. పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు, వీడియోలు రావడంతో కౌశిక్ రెడ్డి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తాడనే అంశంపై మండలంలో అన్ని వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

ఈ వర్గ పోరు, వివాదాలు ఇలానే కొనసాగితే పార్టీలో ఉండి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రజల మధ్యకు రాలేమంటూ ఒక వర్గం నాయకులు అభిప్రాయపడినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికైనా ముఖ్య నాయకులు మేల్కొని ఈటలపై గెలుస్తారో..? లేక వీరి విభేదాల వల్ల ఈటలకు లాభం చేకూర్చి మళ్లీ ఈటలకు పట్టం కడతారో వేచి చూడాల్సిందే.

Read more:

పువ్వాడ వర్సెస్ పొంగులేటి..ఖమ్మం రాజకీయం నాదా ? నీదా..?

సిసోడియాపైనే ఈడీ ఫోకస్.. కవిత ఎంక్వయిరీపై ‘నో’ క్లారిటీ (వీడియో)


Next Story

Most Viewed