కృష్ణా జలాలపై బీఆర్ఎస్ రణభేరి.. కాసేపట్లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-26 06:07:33  IST  )

తెలంగాణలో నీళ్ల రాజకీయం మరింత వేడెక్కింది.

కృష్ణా జలాలపై బీఆర్ఎస్ రణభేరి.. కాసేపట్లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో నీళ్ల రాజకీయం మరింత వేడెక్కింది. కృష్ణా నది నీటి వాటా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (PRLIS) కేవలం 45 టీఎంసీల నీరు సరిపోతుందని కేంద్రానికి లేఖ రాయడం దారుణమని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లి ఫామ్హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలతో భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు, కేటీఆర్‌, పలువురు పార్టీ సీనియర్ నాయకులు కూడా పాల్గొననున్నారు. ఈ భేటీలో ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై లోతైన చర్చ జరగనుంది. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించి పనులు దాదాపు పూర్తి స్థాయికి తీసుకొచ్చినా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అంశంపై చర్చించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్రం తిరస్కరించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉందని ఈ విషయాన్ని ఎండగట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

కృష్ణా జలాల (Krishna Water) విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై గ్రామాల వారీగా సమావేశాలు, జన ఉద్యమాలు చేపట్టాలనే వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నారు. మూడు జిల్లాల్లో జనవరి 2026లో భారీ బహిరంగ సభలు నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇక రాబోయే అసెంబ్లీ (Assembly) సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రభుత్వంపై లేవనెత్తాల్సిన ముఖ్య అంశాలు, నీటి హక్కుల సమస్యలపై బలమైన డిమాండ్లు చేయడంపై కూడా లోతైనగా విస్తృతంగా చర్చించనున్నారు. ఇవాళ్టి భేటీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జల హక్కుల కోసం మరింత బలోపేతమైన పోరాటానికి శ్రీకారం చుట్టనుందని గులాబీ పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

Related News : పాలమూరు వేదికగా గులాబీ గర్జన!

Next Story