మున్సిపల్ ఎన్నికల వేళ రైతులకు తీపికబురు.. రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-04 16:03:01  IST  )

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటనలో భాగంగా గూడూరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన చేసి, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించారు.

మున్సిపల్ ఎన్నికల వేళ రైతులకు తీపికబురు.. రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటనలో భాగంగా గూడూరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన చేసి, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని, తాము చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు.

రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం..

రాష్ట్రంలోని నిరుపేదలు 3.17 కోట్ల మందికి 6 కిలోల సన్నబియ్యం, ఉచిత విద్యుత్‌ను అందజేస్తున్నామని సీఎం తెలిపారు. గతంలో వరి వేస్తే ఉరి అని కేసీఆర్ అన్నారని, కానీ తాము అధికారంలోకి వచ్చాక క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికలు ముగిశాక రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. సన్నబియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వరి ఉత్పత్తిలో మిర్యాలగూడ ఆసియాలోనే ముందుందని కొనియాడారు. ఇప్పటి వరకు రైతు రుణమాఫీ కింద 25.35 లక్షల మందికి రూ.21 వేల కోట్లు జమ చేశామని, మొత్తంగా రైతు సంక్షేమం కోసం రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మీ జాతికే ఆయన ‘జాతిపిత’ ప్రజలకు కాదు.. కేసీఆర్‌పై ధ్వజమెత్తిన సీఎం రేవంత్

Next Story