అంతర్జాతీయ క్రికెట్‌కు కేఎస్ భరత్ గుడ్‌బై.. ఆంధ్రా వికెట్ కీపర్ భావోద్వేగ పోస్ట్!

by Kema Shiva Kumar |

భారత వికెట్ కీపర్ బ్యాటర్, వైజాగ్ క్రికెటర్ కేఎస్ భరత్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు కేఎస్ భరత్ గుడ్‌బై.. ఆంధ్రా వికెట్ కీపర్ భావోద్వేగ పోస్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత వికెట్ కీపర్ బ్యాటర్, ఆంధ్రప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్ కోన శ్రీకర్ భరత్ (KS Bharat) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశం తరఫున ఆడటం తన జీవితంలోనే అత్యంత గౌరవప్రదమైన విషయమని పేర్కొంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలికారు.

భరత్ భావోద్వేగం..

రిటైర్మెంట్ ప్రకటిస్తూ భరత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘమైన, భావోద్వేగభరితమైన పోస్ట్‌ను పంచుకున్నారు. ‘ఎంతో గర్వంతో, అంతకు మించిన కృతజ్ఞతతో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. నా మాతృభూమికి ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలోనే అతిపెద్ద గౌరవం. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి, కానీ భారత్ తరఫున టెస్టు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన ప్రతి క్షణం నా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చింది. మా నలుగురి కుటుంబం గత రెండు దశాబ్దాలుగా ఒకే కలను శ్వాసించింది. నా వెన్నంటి నిలిచిన నా సోదరి, అమ్మ, నాన్నలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారి ప్రేమ, క్రమశిక్షణ, కష్టానికి ప్రతిరూపమే ఈరోజు నేను’ అని భరత్ రాసుకొచ్చారు.

టెస్ట్ జట్టులోకి అరంగేట్రం..

రిషభ్ పంత్ ప్రమాదానికి గురైన సమయంలో 2023లో ఆస్ట్రేలియాపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కేఎస్ భరత్ భరత్ టెస్టుల్లో అరంగేట్రం చేశారు. భారత్ తరఫున మొత్తం 7 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భరత్.. 20.09 సగటుతో 221 పరుగులు చేశారు. ఇందులో అత్యధిక వ్యక్తిగత స్కోరు 44 పరుగులు. దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్ర జట్టు తరఫున భరత్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. రంజీ ట్రోఫీ చరిత్రలోనే ట్రిపుల్ సెంచరీ (302) సాధించిన తొలి వికెట్ కీపర్ బ్యాటర్‌గా 2015లో ఆయన చరిత్ర సృష్టించారు. ఇక ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు భరత్ ప్రాతినిధ్యం వహించారు. ముఖ్యంగా 2021లో ఆర్‌సీబీ తరఫున ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపించిన మ్యాచ్ భరత్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది.

Next Story