రాధ్ ఆల్‌రౌండ్ షో.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్

by Harish |   (  Updated:2026-02-21 10:18:03  IST  )

రాధ్ ఆల్‌రౌండ్ షో.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
X

దిశ, స్పోర్ట్స్ : మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత మహిళల క్రికెట్ జట్టు ‘ఏ’ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం బ్యాంకాక్‌లో జరిగిన సెమీస్‌లో శ్రీలంక ‘ఏ’ జట్టుపై 5 వికెట్ల తేడాతో గెలిచింది. కెప్టెన్ రాధ యాదవ్(4/19, 31) ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19.4 ఓవర్లలో కేవలం 118 రన్స్‌కే ఆలౌటైంది. ఆ టీమ్‌లో సంజన కావిండి(31), శశిని గిమ్హాని(22) మాత్రమే చెప్పుకోదగ్గ రన్స్ చేయగా.. మిగతా వారు విఫలమయ్యారు. భారత కెప్టెన్, బౌలర్ రాధ యాదవ్ 4 వికెట్లతో విజృంభించింది. ఆమెకుతోడు తనూజ, ప్రేమ రావత్ చెరో 2 వికెట్లు పడగొట్టడంతో శ్రీలంక స్వల్ప స్కోరుకే కుప్పకూలింది.

ఇక, 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు 13.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మంచి ఫామ్‌లో ఉన్న విృంద దినేశ్ ఈ మ్యాచ్‌లోనూ మెరిచింది. 20 బంతుల్లో 42 రన్స్ చేసి ఆకట్టుకుంది. అనుష్క శర్మ(27) కూడా పర్వాలేదనిపించింది. బంతితో విజృంభించిన రాధ బ్యాటుతోనూ మెరిసి ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. 18 బంతుల్లో 31 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌ను గెలిపించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన రాధ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. మరో సెమీస్‌లో పాకిస్తాన్ ‘ఏ’ జట్టును బంగ్లాదేశ్ ‘ఏ’ టీమ్ చిత్తు చేసింది. ముందుగా బంగ్లా 110/8 స్కోరు చేయగా.. ఛేదనలో పాక్ 56 పరుగులకే ఆలౌటైంది. దీంతో బంగ్లా ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఆదివారం భారత్ ‘ఏ’, బంగ్లా ‘ఏ’ జట్ల మధ్య ఫైనల్ జరగనుంది.

AUSW vs INDW: మెరిసిన మంధాన, రోడ్రిగ్స్.. ఆస్ట్రేలియాపై భారత్ భారీ స్కోరు

Next Story