రోహిత్ ఎప్పటికీ నాకు కెప్టెనే : జై షా

by Harish |   (  Updated:2026-01-10 11:18:14  IST  )

రోహిత్ ఎప్పటికీ నాకు కెప్టెనే : జై షా
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను తాను ఎప్పటికీ కెప్టెన్ అనే పిలుస్తానని ఐసీసీ చైర్మన్ జై షా వ్యాఖ్యానించారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో జై షా, రోహిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై షా మాట్లాడుతూ.. ‘మా కెప్టెన్ ఇక్కడ కూర్చుని ఉన్నారు. అతన్ని నేను కెప్టెన్ అని మాత్రమే పిలుస్తాను. రోహిత్ కెప్టెన్‌గా రెండు ఐసీసీ టైటిల్స్ అందించాడు.’అని చెప్పారు. జై షా కెప్టెన్‌గా అనగానే రోహిత్, అతని భార్య రితికా చాలా సంతోషపడ్డారు. 2023 వరల్డ్ కప్ ఓటమి తర్వాత తాను చెప్పిన ఓ విషయాన్ని జై షా గుర్తు చేసుకున్నాడు. ‘2023 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచింది. అభిమానుల హృదయాలను గెలుచుకున్నాం. కానీ, కప్పు గెలవలేకపోయాం. 2024 ఫిబ్రవరిలో రాజ్‌కోట్‌లో ఓ విషయం చెప్పాను. వచ్చే వరల్డ్ కప్‌లో మేము హృదయాలతోపాటు కప్పు కూడా గెలుస్తామని చెప్పా. ఆ ఏడాది టీ20 వరల్డ్ కప్‌‌తోపాటు 2025లో చాంపియన్స్ ట్రోఫీ కూడా సాధించాం.’అని జై షా చెప్పుకొచ్చారు. టీ20, టెస్టు ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన రోహిత్.. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్‌ను వన్డే కెప్టెన్‌గా తప్పించి శుభ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే.

READ MORE .....

కివీస్‌తో వన్డే పోరుకు సై అంటున్న విరాట్, రోహిత్.. వడోదరలో ముమ్మర సాధన

Next Story