రేవంత్ రెడ్డి పోటీ చేసేది ఆ నియోజకవర్గం నుంచేనా..?

by  |
రేవంత్ రెడ్డి పోటీ చేసేది ఆ నియోజకవర్గం నుంచేనా..?
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి : రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాజకీయాల్లో ఈ పేరు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌. ‘ప్రశ్నించే గొంతుక‌’గా పేరు తెచ్చుకున్న రేవంత్‌కు కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ పదవి ఇవ్వడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకులు టీపీసీసీ పోస్ట్ రేవంత్‌కు ఇవ్వడంపై అసంతృప్తిని బయటపెట్టారు. కానీ, ఈ విషయంపై రేవంత్ మాత్రం ఇంకా స్పందింలేదు. ఇది ఇలా ఉంటే పార్టీని బలోపేతం చేసేందుకు రేవంత్ ప్లాన్ ఏంటి.. వ్యూహాలు ఏంటన్నది కూడా ఉత్కంఠను రేపుతోంది. ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి రేవంత్ పోటీ చేస్తారు అన్నది రాజకీయ వేడిని పుట్టిస్తోంది.

రాజకీయ ప్రస్థానం అక్కడి నుంచే..

ఉమ్మడి మహబూబ్‌గర్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలైంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాల విభజన నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గం వికారాబాద్, నారాయణపేట జిల్లాల పరిధిలో భాగమైంది. ఈ నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్ పేట్, కోస్గి మండలాలు వికారాబాద్ జిల్లాలో అంతర్భాగమయ్యాయి. దీంతో ఒకే జిల్లా కేంద్రంగా నియోజకవర్గం లేకపోవడంతో నాయకులకు ఇబ్బందిగా మారింది. అయినప్పటికీ కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి రెండు ధఫాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. కానీ, 2018 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైయ్యాడు. ఆ తర్వాత జరిగిన లోకసభ ఎన్నికల్లో స్థానమార్పిడి చేసుకున్న రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా గెలిచారు.

ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీలో ప్రశ్నించే గొంతుకను ప్రజలు నిలబెట్టుకున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇదే ఊపుతో పార్లమెంట్ పరిధిలోని ప్రజాసమస్యలపై పోరాటాలు చేసిన రేవంత్ మల్కాజ్‌గిరి ప్రజలకు దగ్గరయ్యాడు. ప్రధానంగా పార్లమెంట్ పరిధిలోని ఎల్‌బినగర్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డికి బలమైన అనుచరగణం ఉండడంతో, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నియోజకవర్గం నుంచే రేవంత్ పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది.

కొండా దంపతలకు కీ రోల్… రేవంత్ ప్లాన్ అదేనా..?

ఇక కొడంగల్‌కు దూరమే..

రేవంత్ రెడ్డికి పీసీసీ బాధ్యతలను ఏఐసీసీ అప్పగించడంతో ఆయనపై మరింత బాధ్యత పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రేవంత్ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గం ఎంపిక చేసుకుంటారని సమాచారం. అందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గం నుంచే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్ల తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొడంగల్ ప్రజలకు అందుబాటులో ఉండలేనని గ్రహించిన రేవంత్ తన సోదరుడు కొండల్ రెడ్డికి బాధ్యతలు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మరి కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.

కోమటిరెడ్డి వెనక్కి తగ్గారా.. ఆ మాటల వెనుక వ్యూహమేంటి..?



Next Story