కోమటిరెడ్డి వెనక్కి తగ్గారా.. ఆ మాటల వెనుక వ్యూహమేంటి..?

by  |
కోమటిరెడ్డి వెనక్కి తగ్గారా.. ఆ మాటల వెనుక వ్యూహమేంటి..?
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఓవైపు రేవంత్ నియామకం పట్ల కొత్త ఉత్సహం.. అదే సమయంలో అలకలు, బుజ్జగింపులు, రాజీనామాల పరంపర కొనసాగుతోంది. అయితే టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని నియమించడం పట్ల భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదట్లో అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. టీపీసీసీ కాదు.. టీడీపీ పీసీసీ అని, నోటుకు ఓటు లాగా.. నోటుకు టీపీసీసీ అమ్ముకున్నారంటూ తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. ఓ క్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ మారతారనే సంకేతలు సైతం వెలువడ్డాయి. దాంతో ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ మారితే.. కాంగ్రెస్ పరిస్థితి ఏంటనే చర్చ సాగింది.

అధిష్టానం ఆరాతో తగ్గినట్టేనా..?

కొత్త టీపీసీసీగా రేవంత్‌ను నియమించడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఎవ్వరూ నోరుమెదపొద్దని ముందుగానే కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్ ఆదేశాలిచ్చారు. కొంతమంది నేతలకు ఫోన్‌లో సమాచారం ఇవ్వగా.. ఇద్దరు ముగ్గురు నేతలను నేరుగా కలిసి పరిస్థితిని వివరించి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీపై ఘాటైన విమర్శలకు దిగారు. ఎంపీ వెంకటరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీయడంతో పాటు చర్యలకు వెనుకాడబోమనే సంకేతాలను ఇచ్చింది. దీంతో నిన్నటి వరకు టీపీసీసీ నియామకం పట్ల ఆగ్రహంగా ఉన్న వెంకటరెడ్డి కాస్తంత వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. కొత్త అధ్యక్షుడి నియామకం తర్వాత జిల్లాకు తొలిసారిగా వచ్చారు. భువనగిరి జిల్లా కేంద్రంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ‘ఇక నుంచి తాను రాజకీయాలు మాట్లాడబోనని.. కేవలం అభివృద్దిపై మాత్రమే దృష్టి సారిస్తానంటూ ఎంపీ వెంకటరెడ్డి ప్రకటించడం’ ఇటు సొంత పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలను విస్మయానికి గురిచేసింది. ఎంపీ కోమటిరెడ్డి.. అధిష్టానం వేటు వేస్తుందనే భయంతో వెనక్కి తగ్గారా.. లేదా మరేదైనా వ్యూహం ఉందా.. అన్న ప్రచారం లేకపోలేదు.

నోరుమెదపని రాజగోపాల్ రెడ్డి..

కొత్త టీపీసీసీ నియామకంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెద్దగా నోరు విప్పలేదు. విషయం ఏదైనా దూకుడుగా వ్యవహారించే రాజగోపాల్ రెడ్డి.. టీపీసీసీ విషయంలో మౌనం వహించడం ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. సాధారణ విషయాలకే సొంత పార్టీ నేతలపైన విరుచుకుపడే రాజగోపాల్ రెడ్డి.. సొంత అన్నకు టీపీసీసీ దక్కకపోతే పెద్దగా స్పందించలేదు. ఈ మౌనం వెనుక ఏదైనా ఆంతర్యం ఉందా.. లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏది ఏమైనా ఇటు ఎంపీ వెంకటరెడ్డి.. అటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు అంతుబట్టడం లేదు.

రేవంత్ రెడ్డి పోటీ చేసేది ఆ నియోజకవర్గం నుంచేనా..?


Next Story

Most Viewed