ఉత్తమ్‌ రాజీనామా.. ఢిల్లీకి రేవంత్‌రెడ్డి..?

by  |
ఉత్తమ్‌ రాజీనామా.. ఢిల్లీకి రేవంత్‌రెడ్డి..?
X

దిశ, వెబ్‌డెస్క్: డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్‌డే రోజు రేవంత్‌రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టబోతున్నారా? అంటే అవుననే సంకేతాలు వినపడుతున్నాయి. గ్రేటర్ ఫలితాలకు బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేయడంతో… హైకమాండ్ నుంచి వెంటనే రేవంత్‌రెడ్డికి పిలుపురావడం అందులో భాగంగానే భావిస్తున్నారు. 2014 నుంచి తెలంగాణలో పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికిప్పడు అన్ని విధాలుగా సమర్థుడైన రేవంత్‌రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తేనే పార్టీ నిలదొక్కుకుంటుందని, సీనియర్లు, జూనియర్లను కలుపుకొని పార్టీకి పునర్‌వైభవం తీసుకువస్తారని ఇదే విషయాన్ని సోనియా గాంధీకి జాతీయ నేతలు వివరించడంతో రేవంత్‌ను ఫైనల్ చేశారని సమాచారం.

కేసీఆర్ మాటలకు ధీటుగా సమాధానం చెప్పడంతో పాటు… యువతలో మంచి ఫాలోయింగ్ ఉండటం రేవంత్‌కు కలిసి వస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేగాక ఇప్పుడు గ్రేటర్‌లో బీజేపీ బలంగా పుంజుకోవడంతో కేసీఆర్‌కు, బండి సంజయ్‌కు ఎదురు నిలిచి కాంగ్రెస్ సత్తా చాటడానికి ఇదే సరైన సమయం కాబట్టే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే అధిష్ఠానం రేవంత్‌ వైపునకు మొగ్గినట్లు సమాచారం. పార్టీలో నేతల మధ్య పొసగక ఈ ఐదారేండ్ల నుంచి టీఆర్ఎస్, బీజేపీలో చేరిన కీలక నేతలను మళ్లీ హస్తం గూటికి చేర్చి అందరినీ ఒక్కతాటి పైకి తేగల సత్తా రేవంత్‌రెడ్డికి ఉందని పార్టీ శ్రేణులు సైతం అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.

దుబ్బాక ఓటమి తర్వాత రేవంత్‌కే పగ్గాలు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ వెంటనే జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో హైకమాండ్ వెనుకడుగు వేసింది. ఎన్నికల ముందు పీసీసీ పదవి అప్పగిస్తే గ్రూపు‌లుగా ఏర్పడి పార్టీకి నష్టం చేకూరుస్తారని, ఎన్నికల తర్వాత పదవి ఇవ్వాలని పార్టీ భావించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేవలం 2 సీట్లు మాత్రమే రావడంతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ రాజీనామా చేయడం, వెంటనే రేవంత్‌కు ఢిల్లీ రావాలని పిలుపు రావడంతో ఆయన అనుచరుల్లో ఉత్సాహం నెలకొంది.

మరోవైపు రేవంత్‌రెడ్డికి పీసీసీ ఇస్తున్నారన్న ప్రచారంతో సీనియర్లతో పాటు ఇద్దరు ముగ్గురు ఆశావహులు సైతం హస్తిన బాట పట్టాలని నిర్ణయించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏఐసీసీ నేతలతో ఫోన్‌లో మాట్లాడుతూ లాబీయింగ్‌ మొదలుపెట్టారని టాక్. అయితే రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్తుంన్నందున.. ఆయనకే పీసీసీ పీఠం అప్పగిస్తారా లేకుంటే సర్దిచెప్పి ఇంకొకరికి అప్పగిస్తారా అన్నది మూడురోజుల్లో తేలనుంది.

ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్


Next Story

Most Viewed