- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా రిజర్వేషన్ బిల్లు...నేడు లోక్సభలో ఓటింగ్ ప్రక్రియ
కేంద్ర ప్రభుత్వం లోక్సభలో మూడు బిల్లులను గురువారం ప్రవేశపెట్టింది.

బిల్లులు ఆమోదం పొందేనా?
- మహిళా కోటా చట్ట రాజ్యాంగ సవరణకు 2/3 మెజార్టీ అవసరం
- కావాల్సింది 360 ఓట్లు.. ఎన్డీయేకు 293 ఎంపీల బలం
- నేడు లోక్సభలో ఓటింగ్ ప్రక్రియ
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం లోక్సభలో మూడు బిల్లులను గురువారం ప్రవేశపెట్టింది. డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు యూటీ సవరణ బిల్లు, మహిళా చట్టంలో మార్పు కోసం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. మహిళా చట్ట సవరణపై అధికార, ప్రతిపక్షాలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినా.. డీలిమిటేషన్ విషయంలో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వాదనలు జరిగాయి. నేడు లోక్సభలో ఈ బిల్లులపై ఓటింగ్ జరగనుంది. లోక్సభలో బిల్లు ఆమోదం పొందితే రాజ్యసభలో ప్రవేశపెట్టి శనివారం ఓటింగ్ జరుపుతారు. ఈ నేపథ్యంలోనే లోక్సభలో ఈ బిల్లులు ఆమోదం పొందుతాయా? అంత బలం అధికారపక్షానికి ఉన్నదా? అనే చర్చ జరుగుతున్నది. రాజ్యాంగ సవరణ ఉండటంతో సభలో మూడింట రెండు వంతుల మంది ఎంపీలు మద్దతు ఇస్తేనే బిల్లు ఆమోదం పొందుతుంది. లోక్సభలో ఎన్డీయే, ప్రతిపక్షాల బలాబలాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.
అధికార, ప్రతిపక్షాల బలాబలాలు
రాజ్యాంగ సవరణకు 2/3 మెజార్టీ అవసరం. ప్రస్తుతం లోక్సభలో 540 మంది ఎంపీలున్నారు. శుక్రవారం ఎంపీలందరూ సభకు హాజరైతే బిల్లు ఆమోదానికి 360 మంది సభ్యుల మద్దతు అవసరం. ఎన్డీయేకు 293 మంది(240 మంది బీజేపీ ఎంపీలు, 16 మంది టీడీపీ ఎంపీలు, 12 మంది జేడీయూ ఎంపీలు) ఎంపీలున్నారు. అంటే సభలో 54 శాతం బలమున్నది. ప్రతిపక్ష కూటమికి 233 మంది ఎంపీలున్నారు. అందులో కాంగ్రెస్కు 98 మంది ఎంపీలు, సమాజ్వాదీ పార్టీకి 37 మంది ఎంపీలు, టీఎంసీకి 28 మంది ఎంపీలు, డీఎంకేకు 22 మంది ఎంపీల బలమున్నది. అలాగే, ఏడుగురు స్వతంత్ర ఎంపీలు, ఎన్డీయే, ఇండియా కూటములకు చెందని వైసీపీ, ఎంఐఎం, శిరోమణి వంటి పార్టీలకు ఏడుగురు సభ్యుల బలమున్నది.
మ్యాజిక్ ఫిగర్ 360..
సభ్యులంతా సభకు హాజరైన పక్షంలో 360 ఎంపీలు మద్దతిస్తే ఈ మహిళా కోటా, డీలిమిటేషన్ బిల్లులు పాస్ అవుతాయి. ఎన్డీయేకున్న బలం 293. అంటే మరో 67 మంది సభ్యుల మద్దతు అవసరం. అంటే ఈ బిల్లుకు ప్రతిపక్షాల మద్దతు తప్పనిసరి. ఓటింగ్లో పాల్గొనకున్నా.. క్రాస్ ఓటింగ్ జరిగినా.. సభకు గైర్హాజరైనా ఈ మ్యాజిక్ ఫిగర్ అనుగుణంగా తగ్గుతుంది. ఈ కోణంలో సమాజ్వాదీ(37 మంది ఎంపీలు), తృణమూల్ కాంగ్రెస్(28 మంది ఎంపీలు), డీఎంకే(22 మంది ఎంపీలు)ల్లో ఏవేని రెండు పార్టీలు గైర్హాజరైతే బిల్లు ఆమోదం కేంద్రానికి సులువవుతుంది. ఒకవేళ 20 మంది ఎంపీలు గైర్హాజరైతే మ్యాజిక్ ఫిగర్ 360 నుంచి 347కు తగ్గుతుంది. రాజ్యసభలో రాజ్యాంగ సవరణ ఆమోదానికి 163 మంది ఎంపీల మద్దతు అవసరం. ఎన్డీయేకు 141 మంది బలముండగా, ఇండియా కూటమికి 83 మంది ఎంపీల బలమున్నది. బీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ, బీఎస్పీ, స్వతంత్ర ఎంపీలు 20 మంది ఉన్నారు. అంటే, రాజ్యసభలో కేంద్రం బిల్లును ఆమోదించుకోవచ్చు. కానీ, లోక్సభలో ఆమోదం పొందితేనే బిల్లులు పెద్దల సభకు చేరుతాయి. ఇదిలాఉండగా, బిల్లు ఆమోదించుకోవడానికి తమ వద్ద సంఖ్యా బలం లేదని పలువురు బీజేపీ ఎంపీలు అంగీకరించడం గమనార్హం.






