టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలి.. లేఖ విడుదల చేసిన తమిళనాడు CPI

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-07 08:36:03  IST  )

తమిళనాడు గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని.. 108 సీట్లు సాధించిన టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని సీపీఐ డిమాండ్ చేసింది.

టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలి.. లేఖ విడుదల చేసిన తమిళనాడు CPI
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు (Tamilnadu)లో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో రాష్ట్ర గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ (CPI) డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి ము.వీరపాండియన్ ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఏప్రిల్ 23న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వనప్పటికీ, 108 స్థానాలు సాధించిన తమిళ వెట్రి కజగం (TVK) పార్టీని అతిపెద్ద పార్టీగా (Single Largest Party) ఎన్నుకున్నారని సీపీఐ లేఖలో పేర్కొంది. టీవీకే అధినేత విజయ్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా, బాధ్యతలు చేపట్టకముందే మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ నిబంధన విధించడం సరికాదని సీపీఐ అభిప్రాయపడింది.

సుప్రీంకోర్టు తీర్పుల ప్రస్తావన..

ఎస్.ఆర్. బొమ్మై కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేస్తూ.. ఏదైనా పార్టీకి బలం ఉందో లేదో తేల్చాల్సింది అసెంబ్లీ వేదికగానే అని, రాజ్‌భవన్‌లో కాదని స్పష్టం చేసింది. రాజ్యాంగ చట్టాలను, సుప్రీంకోర్టు తీర్పులను గౌరవిస్తూ.. అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించి, అసెంబ్లీలో బలం నిరూపించుకునేందుకు సమయం ఇవ్వాలని సీపీఐ గవర్నర్‌ను కోరింది.

తమిళ రాజకీయాలపై ప్రకాష్ రాజ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. రాజ్యాంగ విరుద్ధమంటూ ఫైర్

Next Story