పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం.. నేడు స్పీకర్‌ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం!

by Ramesh Naini |   (  Updated:2026-03-09 14:13:26  IST  )

పార్లమెంట్‌ బడ్జెట్‌ మలి విడత సమావేశాలు సోమవారం (మార్చి 9) నుంచి పునఃప్రారంభం అయ్యాయి. ఈ దఫా సమావేశాలు అత్యంత వాడివేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది.

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం.. నేడు స్పీకర్‌ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం!
X

దిశ, డైనమిక్ బ్యూరో : పార్లమెంట్‌ బడ్జెట్‌ మలి విడత సమావేశాలు సోమవారం (మార్చి 9) నుంచి పునఃప్రారంభం అయ్యాయి. ఈ దఫా సమావేశాలు అత్యంత వాడివేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు సభలో కీలక చర్చతో పాటు ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. జనవరి 28న రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమైన బడ్జెట్ తొలి విడత సమావేశాలు తీవ్ర గందరగోళం మధ్య ఫిబ్రవరి 12న ముగిశాయి. 2020 నాటి భారత్-చైనా సరిహద్దు ఘర్షణలపై మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణే రాసిన (ఇంకా ప్రచురితం కాని) పుస్తకంలోని అంశాలను ప్రస్తావించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి స్పీకర్ అనుమతి నిరాకరించడంతో ఫిబ్రవరి 2 నుంచి సభలో రగడ మొదలైంది. విపక్షాల ఆందోళనల నడుమ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఫిబ్రవరి 4న ప్రధాని మోదీ సభలో ప్రసంగించలేకపోయారు. అనూహ్యంగా ఆ మరుసటి రోజు (ఫిబ్రవరి 5న) ప్రధాని ప్రసంగం లేకుండానే స్పీకర్ ఆ తీర్మానాన్ని చదివి, మూజువాణి ఓటుతో ఆమోదించడం జరిగిపోయాయి. కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని కూర్చునే స్థానం వద్దకు వెళ్లి 'అవాంఛనీయ చర్య'లకు పాల్పడే ముప్పు ఉందన్న పక్కా సమాచారంతోనే ప్రధానిని సభకు రావొద్దని తాను కోరినట్లు స్పీకర్ అప్పట్లో వివరణ ఇవ్వగా, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆ వాదనను తీవ్రంగా ఖండించారు. ఇదే క్రమంలో సభలో అనుచిత ప్రవర్తనకు గాను 8 మంది విపక్ష సభ్యులపై బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు పడింది.

స్పీకర్‌కు ప్రధాని అండ

స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ తొలి విడత సమావేశాల చివర్లో 118 మంది ప్రతిపక్ష సభ్యుల సంతకాలతో ఆయనపై తొలగింపు నోటీసు ఇచ్చారు. అప్పట్లో ఈ తీర్మానంపై సంతకం చేయని తృణమూల్ కాంగ్రెస్ (TMC) సైతం ఇప్పుడు విపక్షాలకు మద్దతు ప్రకటించడం గమనార్హం. ఈ నోటీసు అందినప్పటి నుంచి ఓం బిర్లా సభాపతి స్థానానికి దూరంగా ఉంటున్నారు. అయితే, తీర్మానంపై నేడు ఓటింగ్ జరగనున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ స్పీకర్‌కు బాసటగా నిలిచారు. శనివారం రాజస్థాన్‌లోని కోటా విమానాశ్రయ శంకుస్థాపన కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని.. ఓం బిర్లాను 'అత్యుత్తమ స్పీకర్', అద్భుతమైన పార్లమెంటేరియన్ అంటూ ప్రశంసించారు.

మధ్యప్రాచ్యంపై నేడు విదేశాంగ మంత్రి ప్రకటన

మరోవైపు, పశ్చిమాసియా (మధ్యప్రాచ్యం)లో ఇరాన్ చుట్టూ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో తలెత్తిన తాజా పరిస్థితులపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ నేడు లోక్‌సభలో ఒక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. కాగా, ఈ బడ్జెట్ మలిదశ సమావేశాలు ఏప్రిల్ 2న ముగియనున్నాయి.

కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవి రద్దు చేసిన హైకోర్టు.. ఎమ్మెల్యేగా బీజేపీ నేత

Next Story