'బెంగాలీ భాష మాట్లాడే వారందరూ బంగ్లాదేశీలు కాదు': ప్రధాని మోదీకి అధిర్ రంజన్ చౌదరి లేఖ

by Malleboina Mahesh |   (  Updated:2025-12-30 07:34:49  IST  )

పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కార్మికులు వివిధ రాష్ట్రాల్లో (ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో) తీవ్ర వివక్షకు గురవుతున్నారని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు.

బెంగాలీ భాష మాట్లాడే వారందరూ బంగ్లాదేశీలు కాదు: ప్రధాని మోదీకి అధిర్ రంజన్ చౌదరి లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కార్మికులు (Migrant workers) వివిధ రాష్ట్రాల్లో (ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో) తీవ్ర వివక్షకు గురవుతున్నారని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi)కి ఒక బహిరంగ లేఖ రాశారు. బెంగాలీ మాట్లాడే భారతీయ కార్మికులకు (Banglabhasi), బంగ్లాదేశీయులకు (Bangladeshi) మధ్య ఉన్న తేడాను పోలీసులు, అధికార యంత్రాంగం గుర్తించలేకపోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. ఎటువంటి తప్పు చేయని అమాయక కార్మికులను అనుమానంతో జైళ్లు, డిటెన్షన్ సెంటర్లకు పంపడం ద్వారా వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన లేఖలో వాపోయారు.

ఒడిశాలోని సంబల్‌పూర్‌లో జరిగిన ఒక దారుణ ఘటనను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన జుయెల్ ఎస్‌కె అనే యువకుడిని 'బంగ్లాదేశ్ చొరబాటుదారు' అనే సాకుతో కొట్టి చంపడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. కేవలం ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే పేద వలస కార్మికుల పట్ల సానుభూతితో వ్యవహరించేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను చైతన్యపరచాలని (Sensitise) ప్రధాని మోడీని ఆయన కోరారు. భాష ఆధారంగా వలస కార్మికులను వేధించడం ఆపాలని, వారి భద్రతను నిర్ధారించాలని అధిర్ చౌదరి తన లేఖలో ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.

Read More..

బెంగాల్ అభివృద్ధికి 'సిండికేట్' అడ్డంకి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Next Story