ట్రంప్ డెడ్‌లైన్ వేళ ముమ్మర చర్చలు.. 45 రోజుల సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరేనా?

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-06 05:43:45  IST  )

ఇరాన్‌కు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సమీపిస్తున్న వేళ 45 రోజుల సీజ్ ఫైర్ చర్చల కోసం పాకిస్థాన్, ఈజిప్ట్‌లు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి.

ట్రంప్ డెడ్‌లైన్ వేళ ముమ్మర చర్చలు.. 45 రోజుల సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా మరో భారీ యుద్ధం అంచున నిలబడింది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ, 45 రోజుల పాటు తాత్కాలిక ‘సీజ్ ఫైర్’ ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ఈ ఒప్పందం కుదిరేందుకు మరింత సమయం పడుతుందని.. మరోవైపు జరగాల్సిన నష్టం జరిగపోతోందని దౌత్య వర్గాలు పేర్కొంటున్నాయి.

ట్రంప్ హెచ్చరిక.. గడువు పొడిగింపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు విధించిన గడువును మరో 20 గంటలు పొడిగించారు. కొత్త డెడ్‌లైన్ ప్రకారం, అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటల లోపు ఇరాన్ ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ‘ఒప్పందం కుదరకపోతే, ఇరాన్‌లోని ప్రతి పవర్ ప్లాంట్, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తాం. వారిపై నరకం కురుస్తుంది’ అని ట్రంప్ ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ ఇంటర్వ్యూలో భయంకరమైన హెచ్చరికలు జారీ చేశారు.

రెండంచెల శాంతి ప్రణాళిక

ప్రస్తుతం ఇరాన్-అమెరికా చర్చల్లో కీలక ప్రతిపాదనలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా 45 రోజుల పాటు తాత్కాలికంగా యుద్ధాన్ని నిలిపివేయడం. ఈ సమయంలో శాశ్వత శాంతి కోసం చర్చలు జరపడం లాంటి విషయాలు డిస్కస్ చేయనున్నారు. అదేవిధంగా హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవడం, ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను తగ్గించడంపై తుది ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా చూస్తోంది.

పాకిస్థాన్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం

పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీ దేశాలు ఇరాన్, అమెరికా చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఫోన్‌లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అయితే, ఇస్లామాబాద్‌లో అమెరికా అధికారులతో నేరుగా భేటీ అయ్యేందుకు ఇరాన్ నిరాకరించింది. అమెరికా ప్రతిపాదనలు తమకు అంగీకారయోగ్యం కాదని ఇరాన్ స్పష్టం చేసింది. ఒకవేళ చర్చలు విఫలమైతే, అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ ఇంధన వనరులపై దాడులు చేసే అవకాశం ఉంది. దీనికి ప్రతికారంగా గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలు, నీటి శుద్ధి ప్లాంట్లపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. హార్ముజ్ జలసంధిలో పరిస్థితులు మునుపటిలా ఉండబోవని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది.

Oil Prices: ట్రంప్ ‘ఇరాన్’ హెచ్చరికల ఎఫెక్ట్.. భగ్గుమన్న చమురు ధరలు

Next Story