చైనాలో కరెన్సీ వాన: భర్తపై కోపంతో బాల్కనీలోంచి రూ.1.5 కోట్లు విసిరేసిన భార్య వైరల్

by Ramesh Naini |   (  Updated:2026-04-21 12:48:45  IST  )

భర్తపై కోపంతో రగిలిపోయిన ఓ మహిళ తన అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి ఏకంగా రూ. 1.5 కోట్ల (సుమారు 2 మిలియన్ల హాంకాంగ్ డాలర్లు) విలువైన నోట్ల కట్టలను కిందకు విసిరేసింది.

చైనాలో కరెన్సీ వాన: భర్తపై కోపంతో బాల్కనీలోంచి రూ.1.5 కోట్లు విసిరేసిన భార్య వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భార్యాభర్తల మధ్య జరిగిన ఓ చిన్న గొడవ ఏకంగా కరెన్సీ వర్షానికి దారితీసింది. భర్తపై కోపంతో రగిలిపోయిన ఓ మహిళ తన అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి ఏకంగా రూ. 1.5 కోట్ల (సుమారు 2 మిలియన్ల హాంకాంగ్ డాలర్లు) విలువైన నోట్ల కట్టలను కిందకు విసిరేసింది. చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శాంతౌ నగరంలోని లాంఘు జిల్లా, స్టార్ లేక్ సిటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వద్ద ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన భార్య, హెచ్‌కే$ 1,000 నోట్ల కట్టలను కిందకు వెదజల్లింది. కొన్ని నోట్లను చించి మరీ బాల్కనీలోంచి విసిరేసింది.

ఎగబడిన జనం.. పోలీసుల రంగప్రవేశం

ఆకాశం నుంచి నోట్ల కట్టలు కింద పడటం చూసిన స్థానికులు, దారిన పోయే వారు ఆ డబ్బును ఏరుకోవడానికి పెద్ద ఎత్తున ఎగబడ్డారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కిందపడిన నోట్లు అసలైనవేనని పోలీసులు ధృవీకరించారు. డబ్బులు ఏరుకున్న వారంతా వెంటనే వాటిని పోలీసు స్టేషన్‌లో గానీ, అపార్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఆఫీసులో గానీ తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు. ఇప్పటికే కొందరు ఆ డబ్బును తిరిగి ఇచ్చేసినట్లు ప్రాపర్టీ సిబ్బంది తెలిపారు.

నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘వివాహం చేసుకునేటప్పుడు సరైన భాగస్వామిని ఎంచుకోవడమే అతిపెద్ద ఆర్థిక సలహా’ అని ఒకరు కామెంట్ చేశారు. ఇలాంటి అపార్ట్‌మెంట్లోనే నేను కూడా నివసించాలి.. అని మరొకరు కామెంట్ చేశారు. వీరిద్దరూ భవిష్యత్తులో మరిన్ని గొడవలు పడాలని కోరుకుంటున్నాను.. అంటూ పలువురు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

నాడు కోటీశ్వరుడు.. నేడు హోటల్ ఉద్యోగి: రూ.2 కోట్లు నష్టపోయినా చెరగని చిరునవ్వు

Next Story