నితీశ్ తివారి ‘రామాయణ’లో రకుల్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-12 14:35:56  IST  )

తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అత్యంత కీలకమైన మలుపు తిప్పే శూర్పణఖ పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నట్లు సమాచారం.

నితీశ్ తివారి ‘రామాయణ’లో రకుల్!
X

దిశ, సినిమా: భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న దృశ్యకావ్యం ‘రామాయణ’. ‘దంగల్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు నితీశ్ తివారి దర్శకత్వంలో రెండు భాగాలుగా వస్తున్న ఈ పౌరాణిక చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి నటీనటుల ఎంపిక ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతమ్మగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉండబోతోందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యష్, రావణుడి భార్య మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించబోతోంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అత్యంత కీలకమైన మలుపు తిప్పే శూర్పణఖ పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నట్లు సమాచారం.

ఈ పాత్ర కోసం దర్శకుడు నితీశ్ తివారి చాలా మందిని పరిశీలించి, పలువురికి టెస్ట్ షూట్ కూడా నిర్వహించినట్లు సమాచారం. చివరకు రకుల్ నటన, ఆమె లుక్ శూర్పణఖ పాత్రకు సరిగ్గా సరిపోతాయని భావించి ఆమెను ఎంపిక చేశారట. గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న రకుల్, ఈ పౌరాణిక పాత్రలో తన విశ్వరూపాన్ని చూపేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. కేవలం ప్రధాన పాత్రలే కాకుండా, ఇతర పాత్రల కోసం కూడా హేమాహేమీలను ఎంపిక చేశారట. హనుమంతుడిగా సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, కౌశల్యగా ఇందిరా కృష్ణన్ నటిస్తున్నారు. ఇలా ప్రతి పాత్రలోనూ పేరున్న నటులు ఉండటం సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్‌కు (VFX) అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళి పండగ సందర్భంగా ప్రేక్షకులకు అందించాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.

అల్లు అర్జున్ ప్రాపర్టీ అంటూ నెటిజన్ల కామెంట్స్.. ఘాటు రిప్లైతో కౌంటర్ ఇచ్చిన సీరత్ కపూర్

Next Story