ఉస్మానియా సవాల్.. కేటీఆర్‌కు కాంగ్రెస్ నేతల వార్నింగ్!

by Ramesh Naini |

అధికారంలోకి రావాల‌న్న దుర్దేశంతో కేటీఆర్ మాట‌లున్నాయని, పేప‌ర్ లీకేజీల‌తో ప‌దేళ్లు ప‌రిపాలించారని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.

ఉస్మానియా సవాల్.. కేటీఆర్‌కు కాంగ్రెస్ నేతల వార్నింగ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : అధికారంలోకి రావాల‌న్న దుర్దేశంతో కేటీఆర్ మాట‌లున్నాయని, పేప‌ర్ లీకేజీల‌తో ప‌దేళ్లు ప‌రిపాలించారని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. శనివారం సీఎల్పీలోని మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ లు బీర్ల ఐలయ్య, అద్దంకి దయాకర్ లతో కలిసి ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నిర్వహించిన యువ సంగ్రామ సదస్సులో కేటీఆర్ చేసిన కామెంట్లపైన మండిపడ్డారు. కేటీఆర్ క‌బ‌ర్దార్.. తమ సీఎంని నోటికొచ్చిన‌ట్లు మాట్లాడితే స‌హించమని, 67,763 ఉద్యోగాల భ‌ర్తీ చేశాం, వివిధ ద‌శ‌ల్లో 13,197 పోస్టుల భ‌ర్తీ ఉంది, మొత్తంగా 80,960 ఉద్యోగాలు భ‌ర్తీ చేశామని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. నిరుద్యోగ యువ‌కుల‌ను హాల్ టిక్కెట్లకు ప‌రిమితంచేశారని, జిరాక్స్ సెంట‌ర్లలో పేప‌ర్లు అమ్ముకున్నా, ఇంట‌ర్ ప్రశ్నాప‌త్రాల‌ను వాల్యూవేష‌న్ ను త‌న బంధువుల‌కు కేటీఆర్ అప్పగించారని మంత్రి ఆరోపించారు. ఓయూలోకి అడుగుపెట్టడానికి కేసీఆర్, కేటీఆర్ సాహ‌సించ‌లేదని ఆయన ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువ‌కుల‌కు ఏ నాడు క‌నీసం క‌లిసే అవ‌కాశం ఇవ్వలేదని, స‌రూర్ న‌గ‌ర్ స్టేడియంలో ఫెయిడ్ ఆర్టిస్టులు, ఫెయిడ్ వ‌ర్కర్లతో కేటీఆర్ మీటింగ్ పెట్టి నోటికొచ్చిన‌ట్లు మాట్లాడారని మంత్రి ఆరోపణలు గుప్పించారు.

ఉస్మానియా గ‌డ్డ మీద అడుగుపెట్టలేని దుస్థితి కేసీఆర్

ఉస్మానియా యూనివ‌ర్సిటీ గ‌డ్డ మీద అడుగుపెట్టలేని దుస్థితిని కేసీఆర్, ఆయ‌న కుటుంబం తెచ్చుకుందని, కేసీఆర్ ఎందుకు ఓయూకి ఎందుకు వెళ్లలేక‌పోయాడు? రూ.1000 కోట్లతో ఉస్మానియా యూనివ‌ర్సిటీకి నిధులు ఇస్తాన‌ని విద్యార్థుల‌కు సీఎం మాట ఇచ్చి వాళ్ల ప‌క్షాన నిల‌బ‌డ్దారని లక్ష్మణ్ కుమార్ చెప్పారు. బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు కాంగ్రెస్ లో ప‌ద‌వులు వ‌స్తుంటే కేటీఆర్ అస‌హ‌నంలో ఉన్నాడుని, ద‌ళితుడు స్పీక‌ర్ గా ఉన్నందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావ‌డం లేదని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ అసెంబ్లీకి వ‌చ్చి చ‌ర్చించాలని, తన శాఖ‌లో రూ. 2000 వేల కోట్ల కుంభ‌కోణం అన్న హ‌రీష్ రావు అసెంబ్లీలోని నిరూపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకోవాలి, బీఆర్ఎస్ ఖ‌తం అయిందని గ్రామాల్లో ఆ పార్టీ కార్యక‌ర్తలే చెపుతున్నారు, 2014 నుంచి 2023 వ‌ర‌కు చేసిన బీఆర్ఎస్ చేసిన పాపాల చిట్టాకు స‌మాధానం చెప్పాలని లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.

దమ్ముంటే అక్కడ స‌భ పెట్టాలి : ప్రభుత్వ విప్

కేటీఆర్ కు దమ్ముంటే స‌రూర్ న‌గ‌ర్ లో కాదు ఉస్మానియా యూనివ‌ర్సిటీలో స‌భ పెట్టాలని ప్రభుత్వ విప్, బీర్ల ఐలయ్య సవాల్ చేశారు. కేటీఆర్ స‌భ‌లో విద్యార్థులు, యువ‌త‌, విద్యావేత్తలు ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో తొలి అమ‌రుడు శ్రీకాంతా చారి కుటుంబాన్నే మ‌రిచిపోయారని, శ్రీకాంతా చారి త‌ల్లికి గౌర‌వ‌మైన హోదాను తమ సీఎం ఇచ్చాడని ఆయన తెలిపారు. తెలంగాణ యువ‌త అంగి, లాగు ఊడ‌బీకిన త‌ర్వాత కేటీఆర్ కు నిరుద్యోగులు గుర్తుకు వ‌చ్చారని బీర్ల ఐలయ్య మండిపడ్డారు. నియామ‌కాలన్ని క‌ల్వకుంట్ల కుటుంబంలోకి వెళ్లాయని, ఎమ్మెల్సీ, రాజ్యస‌భ స‌భ సీట్లను కేసీఆర్ అమ్ముకున్నాడని, అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ మేక వ‌న్నెల పులిలా వ్యవ‌హారించి ఇప్పుడు ముస‌లి క‌న్నీరు కారుస్తున్నాడని బీర్ల ఐలయ్య విమర్శించారు. అద్దంకి ద‌యాక‌ర్ కు మంత్రి హోదా ఇస్తే చూసి త‌ట్టుకోలేక ప్రచారం చేయిస్తున్నాడని, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలు సూటు బూటు వేసుకుంటే త‌ట్టుకోలేరా? అని బీర్ల ఐలయ్య మండిపడ్డారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్ లేదని, రాహుల్ మాట‌ను శిలా శాస‌నంగా భావించి ఆయన ఆలోచ‌న‌ను సీఎం రేవంత్ రెడ్డి అమ‌లు చేస్తున్నారన్నారు. సొంత చెల్లె ప్రశ్నల‌కు స‌మాధానం చెప్పలేని కేటీఆర్, నోరు అదుపులో పెట్టుకోక‌పోతే గ్రామాల్లో జ‌నం వెంట‌ప‌డి కొడ‌తారని బీర్ల ఐలయ్య హెచ్చరించారు.

టీఆర్ఎస్‌ను కేసీఆర్, బీఆర్ఎస్‌ను కేటీఆర్..

కేటీఆర్ ఒక్కడు చాలు బీఆర్ఎస్ ను బొంద పెట్టడానికి, టీఆర్ఎస్ ను కేసీఆర్ బొంద‌పెడితే బీఆర్ఎస్ కేటీఆర్ బొందపెడుతున్నాడని ప్రభుత్వ విప్, అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. కేటీఆర్ పులికేశి అని అంద‌రికీ తెలుసని విమర్శించారు. కేటీఆర్ మీటింగ్ పెట్టిన ఎల్బీ న‌గ‌ర్ లో శ్రీకాంతాచారికి స్మార‌క‌మైనా క‌ట్టించారా? అని నిలదీశారు. కాంగ్రెస్ ముస‌లి న‌క్క అయితే కేటీఆర్ మీ అయ్య కేసీఆర్ ఏ న‌క్క? కాంగ్రెస్ పార్టీ క‌ల్వకుంట్ల కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చింది, వార్డు మెంబ‌ర్ కాని హ‌రీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యాడని అద్దంకి దయాకర్ అన్నారు. ఎంపీ కాగానే కేసీఆర్‌ను సోనియ‌మ్మ కేంద్ర మంత్రిని చేశారని, కేంద్రమంత్రిగా కేసీఆర్ సహార కుంభ‌కోణంలో ఇరుకున్నారని ఆయన ఆరోపించారు. క‌ల్వకుంట్ల కుటుంబం గుంట న‌క్కల కుటుంబం మని అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు. తమకు ప‌ద‌వులు వ‌స్తే ఉద్దేశ‌పూర్వకంగా ట్రోల్ చేస్తున్నారని, 20 ఏళ్లు క‌ష్టప‌డితే తనకు ప‌ద‌వి వ‌చ్చింని, పార్టీని కాపాడుతున్నందుకు తనకు రేవంత్ రెడ్డి ఈ ప‌ద‌వి ఇచ్చారని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి యువ‌త‌కు తోడుగా ఉంటారు, ఖచ్చితంగా నోటిఫికేష‌న్లు వ‌స్తాయని ఆయన తెలిపారు.

Next Story