K.Vishwanath తనది తండ్రీకొడుకుల అనుబంధం:Chiranjeevi

by Disha Web Desk 4 |
K.Vishwanath  తనది తండ్రీకొడుకుల అనుబంధం:Chiranjeevi
X

దిశ, వెబ్ డెస్క్: కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా దిగ్గజ దర్శకుడితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. 'ఇది అత్యంత విషాదకరమైన రోజు. పితృ సమానులు, కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన గొప్పతనం గురించి చెప్పటానికి మాటలు చాలవు. పండితులని పామరులనీ కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైంది. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలిమ్స్ ని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా మలిచిన దర్శకుడు బహుశా ఇంకొకరు లేరు. తెలుగు జాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహాదర్శకుడు ఆయన. ఆయన దర్శకత్వంలో శుభలేఖ, స్వయం కృషి, ఆపద్భాంధవుడు అనే మూడు చిత్రాల్లో నటించే అవకాశం నాకు లభించింది. నాకు వ్యక్తిగతంగా ఆయనతో ఉన్నది గురు శిష్యుల సంబంధం. అంతకు మించి తండ్రీ కొడుకుల అనుబంధం. ఆయనతో గడిపిన సమయం నాకు అత్యంత విలువైనది.' అని తెలిపారు.

ప్రతి నటుడికీ ఆయనతో పని చేయడం ఒక ఎడ్యుకేషన్ లాంటిది. ఆయన చిత్రాలు భావి దర్శకులకి ఒక గైడ్ లాంటివి. 43 సంవత్సరాల క్రితం, ఆ మహానీయుడి ఐకానిక్ చిత్రం శంకరాభరణం విడుదలైన రోజే బహుశా ఆ శంకరుడికి ఆభరణంగా, ఆయన కైలాసానికి ఏతెంచారు. ఆయన చిత్రాలు, చిత్రాల సంగీతం, కీర్తి అజరామరమైనవి. ఆయన లేని లోటు భారతీయ చిత్ర పరిశ్రమకి, తెలుగు వారికి ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులందరికీ , అసంఖ్యాకమైన ఆయన అభిమానులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను.

ఇవి కూడా చదవండి : NTR, K.Vishwanath ల మధ్య ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?

Next Story