సింగ్ ఎఫెక్ట్.. టీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్

by  |
సింగ్ ఎఫెక్ట్.. టీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: క్లియర్ కట్ మెజార్టీ ఉన్నా అధికార టీఆర్‌ఎస్ పార్టీ అధిష్టానానికి ఓ భయం పట్టుకుందా..? ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ప్రకటించిన అభ్యర్థుల్లో ఇద్దరికి కంప్లీట్ మెజార్టీ వచ్చే అవకాశాలు లేవన్న విషయం తెలిసిందా..? నిఘా వర్గాలు కూడా అప్రమత్తం చేయడంతో అలర్ట్ అయిందా? అంటే అవునన్న అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన అధిష్టానం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టినట్టు సమాచారం.

మంత్రులూ అక్కడే…

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ లతో పాటు నియోజకవర్గ ఇంఛార్జీలను, పార్టీకి చెందిన కొంతమంది బాధ్యులను కూడా క్యాంప్ లో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. దీంతో వీరంతా కూడా క్యాంపుల్లో ఉంటూ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను మానిటరింగ్ చేస్తున్నారు. రోజూ సమావేశం అవుతూ వారిపై ప్రత్యర్థుల ప్రభావం లేకుండా జాగ్రత్త పడుతున్నారు. క్యాంపుల్లో ఉన్న వారెవరూ కూడా ప్రత్యర్థులతో టచ్ లో ఉండకుండా కట్టడి చేస్తున్నారు. మంత్రులతో పాటు ఇతర నాయకులు కూడా పోలింగ్ వరకూ ఉండాలని చెప్పినట్టు తెలుస్తోంది.

సింగ్ ఎఫెక్టేనా..?

అనూహ్యంగా అధిష్టానాన్ని ధిక్కరించి బరిలో నిలిచిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవిందర్ సింగ్ కారణంగానే పార్టీ పకడ్బందీ చర్యలకు నడుం బిగించినట్టు తెలుస్తోంది. ఆయనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యక్తిగత పరిచయాలు ఉండడంతో పాటు ప్రతర్ధి పార్టీల మద్దతు కూడగట్టుకుంటున్నారని, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా సపోర్ట్ ఇస్తుండడంతో అధికార పార్టీ ఓట్లు చీలకుండా వ్యూహం రచించినట్టు సమాచారం. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు క్రాస్ ఓటింగ్ చేసే అవకాశం ఉందని గమనించిన అధిష్టానం ప్రత్యేక చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది. ఒక ఓటు రమణకు మరో ఓటు రవిందర్ సింగ్ కు అన్న ప్రచారం తీవ్రంగా సాగుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులిద్దరూ గెలవాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. సగం మంది ఫస్ట్ ఓటు రమణకు, సగం మంది సెకండ్ ఓటు భాను ప్రసాదరావుకు, సగం మంది ఫస్ట్ ఓటు భాను ప్రసాదరావుకు, సగం మంది సెకండ్ ఓటు రమణకు వేయాలన్న విషయంపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఒక్క ఓటు కూడా చీలకుండా ఉండేందుకు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నం అయ్యారు.

విభాగాల వారీగా ట్రేస్…

క్యాంపులో ఉన్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీల వారిగా లెక్కలు తీసిన అధిష్టానం ప్రత్యర్థి వైపు మొగ్గు చూపుతున్నవారి లెక్కలు కూడా తీసినట్టుగా తెలుస్తోంది. వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఆ ఓట్లు డైవర్ట్ కాకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.

ప్రశాంత్ కిషోర్‌తో టీఆర్‌ఎస్ చర్చలు.. అందుకోసమేనా?


Next Story

Most Viewed