తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి సెలవులు రద్దు

by  |
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి సెలవులు రద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో : హెల్త్​కేర్ ​వర్కర్ల లీవ్‌లు రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే సెలవులపై వెళ్లినోళ్లు వెంటనే డ్యూటీల్లో చేరాలని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు అంతర్గత ఆదేశాలిచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి టీచింగ్​ఆస్పత్రుల వరకు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా విధుల్లో ఉండాలని పేర్కొన్నారు. దీంతోపాటు ఆయా ఆసుపత్రుల్లో సరిపడా వైద్యసిబ్బందిని సమకూర్చుకోవాలని సూచించారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్, శానిటేషన్​సిబ్బందిని ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు.

ముఖ్యంగా జిల్లా, టీచింగ్ ఆసుపత్రుల్లో జనరల్​ఫిజీషియన్, పల్మనాలజిస్టులను తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. వారు లేని ఆస్పత్రుల నివేదికను ఇవ్వాలని ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించింది. ఎక్కువ సంఖ్యలో ఉన్నచోట నుంచి లేని దవాఖానలకు సర్దుకోవాలని సూచించారు. తెలిపారు. మరో యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు అన్ని విభాగాల వైద్యసిబ్బంది రెడీగా ఉండాలని ఉన్నతాధికారులు కోరారు. ఈ మేరకు జిల్లా వైద్యాధికారుల ఆధ్వర్యంలో రివ్యూలు పెడుతూ వైద్య సిబ్బందిని మానసికంగా ప్రిపేర్ చేస్తున్నారు.

కేసులు పెరిగితే..

డెల్టాతో పోల్చితే ఒమిక్రాన్​ ఏకంగా ఆరు రెట్లు అదనపు స్పీడ్‌తో వ్యాప్తి చెందుతున్నదని సైంటిస్టులు, డాక్టర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒమిక్రాన్ ప్రభావిత రాష్ట్రాల్లోనూ అదే ట్రెండ్ కొనసాగుతున్నది. మరణాలు, తీవ్రత లేనప్పటికీ భారీ స్థాయిలో కేసులు పెరుగుతాయని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది. ఇదే నిజమైతే ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రభుత్వం పరిధిలో ఉన్న మౌలిక వసతులు, మ్యాన్​పవర్‌పై తప్పకుండా ఒత్తిడి పడుతుంది. పేషెంట్లను మానిటరింగ్ చేయడంలో, ట్రీట్‌మెంట్లు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది. ఒకేసారి లక్షల్లో కేసులు వస్తే పరిస్థితులు భయాందోళన చెందే విధంగా ఉంటాయని పబ్లిక్​హెల్త్​సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న మ్యాన్​పవర్‌తో దాదాపు కేవలం 15 వేల ఒమిక్రాన్ ఇన్​పేషెంట్ల వరకు కంట్రోల్​చేయొచ్చని, ఆ సంఖ్య పెరిగితే ప్రభుత్వ వైద్యులు చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితులు వస్తాయని స్వయంగా వారే ఆఫ్​ది రికార్డులో తేల్చేస్తున్నారు. దీంతో సదరు బాధితులు ప్రైవేట్ పై ఆధారపడాల్సిందే. ఇదే అదనుగా ప్రైవేట్​సెక్టార్​ఒమిక్రాన్​పేరిట మరోసారి దందాను షురూ చేసే ఛాన్స్​ఉన్నదని గవర్నమెంట్​డాక్టర్ల నుంచి అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ వేగంగా స్ప్రెడ్‌ కాకుండా చర్యలు తీసుకోవాలని ఎక్స్‌పర్ట్స్ కోరుతున్నారు. వ్యాక్సిన్లు వేసుకోవడంతోపాటు, మాస్కు, భౌతిక దూరం, శానిటేషన్​వంటివి పకడ్బంధీగా పాటించాలని వైద్యాధికారులు నొక్కి చెబుతున్నారు.

మూడో వేవ్‌కు ముందస్తు ఏర్పాట్లు ఇలా..

రాష్ట్రంలో మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఆరోగ్యశాఖ అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నది. 112 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ పేషెంట్లకు వైద్యం అందించేందుకు సర్వం సిద్ధం చేసింది. రోగుల సంఖ్య పెరిగితే అదుపు చేయడం కోసం మరో 1,215 ప్రైవేట్​ఆస్పత్రులకూ కరోనా వైద్యానికి పర్మిషన్ ఇచ్చింది. సర్కారు దవాఖానల్లో 15,009 సాధారణ, ఆక్సిజన్​, ఐసీయూ బెడ్లను సిద్ధం చేయగా, ప్రైవేట్‌లో మరో 39,236 పడకలను అత్యవసర కింద అందుబాటులో ఉంచింది. అంటే రెండు సెక్టార్‌లు కలిపి 54,245 బెడ్లు కేవలం కరోనా రోగుల కోసమే వినియోగించనున్నారు.

రాష్ట్రంలో ఏర్పాట్లు ఇలా..

ఎన్​95 మాస్కులు — 41.11లక్షలు
పీపీఈకిట్లు– 8.58లక్షలు
3ప్లేమాస్కులు– 149.05లక్షలు
ఆర్టీపీసీఆర్​కిట్లు — 2.91లక్షలు
యాంటీజెన్​కిట్లు– 27.04 లక్షలు
హోం ఐసోలేషన్​కిట్లు– 8.71కిట్లు
రెమిడెసివిర్– ​ 2.44 లక్షలు
పారాసిటోమాల్– 5.74 కోట్లు
లివోసిట్రిజన్ — 2.59 కోట్లు
మిథైల్​ప్రిడ్నోసిలోన్​– 1.05. కోట్లు
డెక్సామెథాజోన్– 2.50 కోట్లు
అజిత్రోమైసిన్ — 1.28 కోట్లు
డాక్సిసైక్లిన్​హెచ్​సీఐ — 1.65 కోట్లు
సాధారణ బెడ్లు
(ప్రభుత్వం, ప్రైవేట్​) — 21,558
ఆక్సిజన్​ బెడ్లు — 21,751
ఐసీయూ బెడ్లు– 11,429
పీడియాట్రిక్​ స్పెషల్​ బెడ్లు– 5,200
ప్రతి రోజూ ఆక్సిజన్​కెపాసిటీ — 327 మెట్రిక్​ టన్నులు.

త్వరలోనే సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. మరిన్ని పదవుల భర్తీకి రంగం సిద్ధం

staff-nurse


Next Story

Most Viewed