వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు చెక్..

by Kodari Anjali |

నగరంలో వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న హ్యాబిచ్యువల్ నేరస్థుడిని దబీర్‌పురా పోలీసులు అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి రెండు చోరీకి గురైన హోండా యాక్టివా ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు చెక్..
X

దిశ, చంపాపేట్: నగరంలో వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న హ్యాబిచ్యువల్ నేరస్థుడిని దబీర్‌పురా పోలీసులు అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి రెండు చోరీకి గురైన హోండా యాక్టివా ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ పలువురు పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన చోరీ కేసుల్లో ఈ నిందితుడి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, డోమల్‌గూడకు చెందిన దాసరి శ్యామ్ అలియాస్ నర్సింగ్ (55) హోటల్‌లో పనిచేస్తూ అవకాశమొచ్చినప్పుడల్లా పార్కింగ్ ప్రదేశాల్లో ఉన్న ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. ఇతడు డోమల్‌గూడ పోలీస్ స్టేషన్‌కు చెందిన సస్పెక్ట్ షీటర్‌గా గుర్తింపు పొందాడు. న్యూ మలక్‌పేట్‌కు చెందిన మిర్ ముర్తుజా రబ్బానీ తన హోండా యాక్టివా 3జీ (TS11EG4889)ను జూలై 12న ఇంటి ముందు పార్క్ చేయగా, జూలై 14న వాహనం కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బాధితుడు డయల్–100కు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన దబీర్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుడిని జూలై 21న అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు.

నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా..

అతడి వద్ద నుంచి దబీర్‌పురా పోలీస్ స్టేషన్ కేసుకు సంబంధించిన హోండా యాక్టివా 3జీ (TS11EG4889)తో పాటు, నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన హోండా యాక్టివా (TS09EH4322)ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడిపై నారాయణగూడ, చిక్కడపల్లి, బేగంపేట్, అఫ్జల్‌గంజ్, గుడిపల్లి (నల్గొండ జిల్లా) తదితర పోలీస్ స్టేషన్లలో నమోదైన పలు ద్విచక్ర వాహనాల చోరీ కేసులు ఉన్నట్లు బయటపడింది. అంతేకాకుండా హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ-పెట్టీ కేసులో కూడా శిక్ష అనుభవించిన రికార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. ఇతడు మరిన్ని చోరీ కేసుల్లో ప్రమేయం కలిగి ఉన్నాడా అనే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసును దబీర్‌పురా పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎస్. కీర్తి తన బృందంతో కలిసి దర్యాప్తు చేయగా, ఇన్‌స్పెక్టర్ పి. ఉపశంకర్, మలక్‌పేట్ ఏసీపీ ఎల్. రాజా వెంకట్ రెడ్డి, చార్మినార్ జోన్ అదనపు డీసీపీ కె. మహ్మద్ మజీద్ పర్యవేక్షణలో కేసును ఛేదించారు. ద్విచక్ర వాహనాల చోరీ కేసును వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసు బృందాన్ని చార్మినార్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభినందించారు.

Next Story