బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా, ప్రెస్ మీట్

by  |
etela resignation
X

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి ఈటల రాజేందర్​ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్​ ఫార్మాట్​లో చేసిన రాజీనామా లేఖను శనివారం ఉదయం అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులుకు అందించారు. ఎమ్మెల్యే పదవితో పాటుగా టీఆర్​ఎస్​ పార్టీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వాస్తవంగా టీఆర్​ఎస్​కు గతంలోనే రాజీనామా చేసినట్లు వెల్లడించారు. మొన్నటి వరకు టీఆర్ఎస్​లో తిరుగులేని నాయకుడిగా ఉన్న ఆయన.. ఇప్పుడు ఆ పార్టీకి శాశ్వతంగా వీడ్కోలు పలికారు. ఏప్రిల్​ 30న భూ కబ్జా ఆరోపణలపై అప్పుడు కేబినెట్​లో ఉన్న మంత్రి ఈటలపై విచారణకు ఆదేశించిన సీఎం కేసీఆర్​ ఆ మరునాడే ఆయన్ను కేబినెట్​ నుంచి బర్తరఫ్​ చేశారు. అప్పటి నుంచి ఈటల రాజేందర్… కేసీఆర్​తో యుద్ధానికి దిగారు. ప్రస్తుతం బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్న ఈటల… టీఆర్​ఎస్​కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

శనివారం ఉదయం శామీర్​పేటలోని ఆయన నివాసం నుంచి అనుచరులతో కలిసి గన్​పార్క్​ దగ్గరకు చేరుకుని తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఈటలతో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి, కరీంనగర్​ జెడ్పీ మాజీ ఛైర్మన్​ తుల ఉమతో పాటు పలువురు నేతలు వెంట వచ్చారు. కరీంనగర్​ జిల్లా హుజురాబాద్​ నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్​ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

14న కాషాయం కండువా

ఈ నెల 14న రాష్ట్రానికి చెందిన బీజేపీ ముఖ్య నేతలతో కలసి ఈటల రాజేందర్‌ ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. అదేరోజు సాయంత్రం బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా, తరుణ్‌ ఛుగ్‌ తదితరుల సమక్షంలో ఈటల రాజేందర్‌ ఆ పార్టీలో చేరనున్నట్లు ఇప్పటికే ఖరారైంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్, రాష్ట్ర పార్టీ సీనియర్‌ నేతలు శుక్రవారం శామీర్‌పేటలోని ఈటల నివాసానికి వెళ్లి చర్చలు జరిపిన సంగతి తెలిసిదే. దీనిలో భాగంగా ఆయన ఎల్లుండి బీజేపీ కండువా కప్పుకోనున్నారు.

నాది ధర్మ యుద్దం : ఈటల

రాజీనామా ఇచ్చేందుకు ముందుంగా గన్​పార్క్​ దగ్గర ఈటల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశానని, ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్‌ నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో జరిగే ఎన్నికలు కురుక్షేత్రమేనని, హుజురాబాద్​లో కౌరవులకు, పాండవులకు యుద్ధం జరుగబోతోందన్నారు. కేసీఆర్‌ దగ్గర రూ.వందల కోట్లు ఉన్నాయని, అధికార దుర్వినియోగం చేసి ఉపఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ నియంతృత్వ పాలనకు ఘోరీ కట్టడమే తన అజెండా అని, హుజూరాబాద్‌లో గెలిచి ఆత్మగౌరవాన్ని నిలబెడతానన్నారు. సమైక్య పాలకులపై అసెంబ్లీలో గర్జించానని, ఇప్పుడు స్వరాష్ట్రంలో అదే పరిస్థితి వచ్చిందని, కరోనాతో వందల మంది ప్రాణాలు పోతుంటే రాజకీయాల్లో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: ఈటలతోపాటే బీజేపీలోకి మంత్రి హరీష్ రావు సన్నిహితుడు

ఇక సమైక్య పాలనలో తెలంగాణ స్వరాష్ట్రమే శ్రీరామ రక్ష అని కొట్లాడామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనేకమంది ఇతర పార్టీల్లో గెలిచి రాజీనామా చేయకుండా టీఆర్​ఎస్​లో చేరి సిస్సిగ్గుగా మంత్రులుగా కొనసాగుతున్నారన్నారు. హుజురాబాద్​ ఉప ఎన్నిక యావత్​ తెలంగాణ ప్రజలకు, కేసీఆర్​ కుటుంబానికి మధ్య జరుగుతోందని, రాష్ట్రం ఏమవుతున్నా పట్టించుకోవడం లేదని కానీ తనను చక్రబంధంలో పెట్టేందుకు అధికారాన్ని మొత్తం వాడుతున్నారన్నారు. అయినా తనకు నిర్భందాలు కొత్తకాదని, నియంత నుంచి తెలంగాణను విముక్తి కల్పించడమే తన లక్ష్యమన్నారు.

కేసీఆర్​ పాలనను అంతమొందించేందుకు ఆర్​ఎస్​యూ నుంచి ఆర్​ఎస్​ఎస్​ వరకు అందరూ కలిసి వస్తున్నారని, 2001లో తెలంగాణ కోసం… 2021లో తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఉద్యమం మొదలుపెడుతున్నామన్నారు. 2018లోనే హుజురాబాద్​లో తనను ఓడించేందుకు మంత్రి కేటీఆర్​ కుట్ర చేశారని, కాంగ్రెస్​ అభ్యర్థి కౌశిక్​రెడ్డికి డబ్బులు ఇచ్చారని, తన ఇంటిమీద రైడ్​ చేయించారన్నారు. కౌశిక్​రెడ్డికి రోజూ ప్రగతిభవన్​ నుంచి ఆదేశాలు వస్తున్నాయని, వాటి ప్రకారమే ఆయన మాట్లాడుతున్నారని బాంబు పేల్చారు ఈటల రాజేందర్.


Next Story