ఈటలతోపాటే బీజేపీలోకి మంత్రి హరీష్ రావు సన్నిహితుడు

by  |
harish rao close associate
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఆర్టీసీ జేఏసీ మాజీ ఛైర్మన్​, టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి బీజేపీలో చేరడం ఖరారైంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్​తో కలిసి ఈ నెల 14న ఆయన కాషాయం కండువా కప్పుకోనున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలకు చెందిన పలువురు లీడర్లతో కలిసి ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎల్లుండి ఢిల్లీలో బీజేపీలో చేరుతున్నట్లు అశ్వత్థామరెడ్డి దిశకు వెల్లడించారు.

ఆర్టీసీలో అశ్వత్థామరెడ్డి చెరగని ముద్ర వేసుకున్నారు. వాస్త‌వానికి ఆర్టీసీ సమ్మె తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, కార్మిక సంఘాలు లేకుండా చేసే ప్రయత్నాలతో పాటు అనంతర పరిణామాల నేపథ్యంలో అశ్వత్థామరెడ్డి సైలెంట్ అయిపోయారు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికుల పాత్ర, స్వరాష్ట్రంలో సమస్యల సాధన కోసం సమ్మెలో అశ్వత్థామరెడ్డి ఎలాంటి ఆరోపణలకు వెరవకుండా ఉద్యమాన్ని కొనసాగించడంతో ప్రభుత్వం ఆయన్ను టార్గెట్​ చేసింది. అశ్వత్థామను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ నేతలతో సంప్రదింపులు మొదలయ్యాయి. అశ్వత్థామరెడ్డి బీజేపీలో చేరితే గ్రేటర్ ఆర్టీసీలోని కార్మిక వర్గం మద్దతు పలికే అవకాశం ఉందంటూ కాషాయదళం భావిస్తోంది. మరోవైపు ఆయన వనపర్తి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా ప్రచారం.

కాగా అశ్వత్థామరెడ్డి టీఎంయూ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి మంత్రి హరీష్​రావుకు సన్నిహితుడిగా గుర్తింపు ఉంది. గతంలో ఆర్టీసీలో పలుమార్లు సమ్మెకు దిగుతామని ప్రకటించిన నేపథ్యంలో హరీష్​రావుతోనే మధ్యవర్తిత్వం చేయించారు. అంతేకాకుండా మంత్రి హరీష్​రావుకు సన్నిహితుడు కావడంతోనే అశ్వత్థామరెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్​ చేశారనే ప్రచారం కూడా జరిగింది.


Next Story