తెలంగాణ విద్యలో నిరాశ

by Disha edit |
తెలంగాణ విద్యలో నిరాశ
X

ఒక పక్క ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తూ, మరో పక్క పేదల పిల్లలు పెద్ద చదువులు చదవడానికి అవకాశం కల్పిస్తున్న యూనివర్సిటీల సమగ్రతను దెబ్బ తీయడం అనేది సాధించుకున్న తెలంగాణ ఆకాంక్షకు వ్యతిరేకం. ఈ విషయం కేసీఆర్‌కు తెలియనిది కాదు. ఇక వర్సిటీల హాస్టల్స్, మెస్‌‌లు అయితే కొత్త భవనాల నిర్మాణం జరగక, వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ధరలకు సరిపడా మెస్ చార్జీలను విడుదల చేయకపోవడంతో, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదు. ఇలా ప్రభుత్వం ప్రతి విషయంలో వర్సిటీలపై సవతి తల్లి ప్రేమను చూపెడుతున్నది. ఇది ముమ్మాటికీ తెలంగాణ కోసం విద్యార్థులు చేసిన త్యాగాలను వెక్కిరించినట్టు అవుతుంది. యూనివర్సిటీలకు నిధుల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి వహించకపోతే విద్యార్థుల ఆగ్రహజ్వాలలకు ఆహుతి కావాల్సి వస్తుంది. తెలంగాణ కోసం కొట్లాడిన స్ఫూర్తి ఇంకా సమసిపోలేదన్న విషయాన్ని కేసీఆర్ గుర్తెరిగి యూనివర్సిటీల సమస్యలు పరిష్కరించాలి.

తెలంగాణ రాష్ట్రంలో చదువులు రోజురోజుకూ పెను ఆర్థిక భారంగా తయారవుతున్నాయి. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామనీ, కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలు చేస్తామని చెప్పిన పాలకుల చర్యలు మాత్రం అందుకు భిన్నంగా ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. నిజానికి రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీల ఫీజులు ఎంతగా పెరుగుతున్నాయో, ప్రభుత్వ విద్యా సంస్థలలోనూ అంతే పెరుగుతున్నాయి. ముఖ్యంగా యూనివర్సిటీలలో అయితే ప్రతి సంవత్సరం రెట్టింపు స్థాయిలో ఫీజులు పెరుగుతున్నాయి.

మూడు రెట్ల ఫీజు పెంచి

తెలంగాణ రాకముందు యూనివర్సిటీ స్థాయిలో రెగ్యూలర్ కోర్సులే ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం ఉస్మానియా వర్సిటీలో(osmania university) ఎప్పుడూ లేని విధంగా రెగ్యులర్ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా(self finance courses) మార్చారు. రెగ్యూలర్ కోర్సు ఫీజు అయిదు వేల నుంచి ఆరువేల రూపాయల మధ్య ఉండేది. ఇప్పుడు అది 15 వేల నుంచి 20 వేల రూపాయలకు చేరింది. చాలా కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చి ఒక్కో విద్యార్థికి 30 నుంచి 35 వేల రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక్కడ చదివే విద్యార్థులు 80 శాతం పేదరికంలో ఉండి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారే. అలాంటి విద్యార్థులకు ప్రభుత్వ యూనివర్సిటీ స్థాయిలో ఫీజుల భారం ఉండటం ఆశ్చర్యకరం.

ప్రభుత్వ యూనివర్సిటీలకు నిధుల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపడం చేత ఆ ఆర్థిక భారం విద్యార్థులపై పడుతోంది. ఇది యూనివర్సిటీలను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్న కుట్రగా భావించవచ్చు. మూడు సంవత్సరాల క్రితం ఉన్న ఫీజులకు ఇప్పటి ఫీజులకు మూడు రెట్లు పెంచారు. ఇక్కడ కేజీ టూ పీజీ ఉచిత విద్యా(KG-PG free education) ఎక్కడ కనబడుతుంది? పోనీ, అంత భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేసినా నాణ్యమైన విద్యను అందిస్తున్నారా? అంటే అదీ లేదు. 2014 నుంచి ఇప్పటివరకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ కాలేదు. విద్యార్థులకు గెస్ట్ ఫ్యాకల్టీ(guest faculty) చేత పాఠాలు చెప్పిస్తున్నారు. వారికి విద్యార్థులు చెల్లించే ఫీజులతో జీతాలు ఇచ్చే దౌర్భాగ్య స్థితికి యూనివర్సిటీలు చేరాయి.

తెలంగాణ ఆకాంక్షకు వ్యతిరేకం

రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రైవేట్ యూనివర్సిటీల(5 private universities) ఏర్పాటు కోసం ఆగమేఘాలపై అసెంబ్లీలో చర్చ పెట్టి బిల్లును తీసుకొచ్చిన ప్రభుత్వం, ప్రభుత్వ యూనివర్సిటీల విషయంలో ఇంతటి వివక్షకు ఒడిగట్టడం దారుణం. ఇది తెలంగాణ ఉద్యమంలో(telangana movement) ఉవ్వెత్తున ఎగిరిన విద్యార్థి లోకాన్ని రాజకీయ, సామాజిక, ఆర్థిక చైతన్యం నుంచి దూరం చేసి యూనివర్సిటీ వేదికగా అట్టడుగు వర్గాల వారిని విద్యకు దూరం చేయడమే. దేశంలో పేద ప్రజలకు విద్య అందాలంటే విద్య వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉండాలి. కానీ, టీఆర్ఎస్(trs) అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ యూనివర్సిటీలు పెరిగిపోయి బలపడుతున్నాయి. అవి కూడా నియంత్రణ లేకుండా, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కొంతమంది చేతులలోనే ఉండడం నియంత పాలనకు నిదర్శనం.

ఒక పక్క ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తూ, మరో పక్క పేదల పిల్లలు పెద్ద చదువులు చదవడానికి అవకాశం కల్పిస్తున్న యూనివర్సిటీల సమగ్రతను దెబ్బ తీయడం అనేది సాధించుకున్న తెలంగాణ ఆకాంక్షకు వ్యతిరేకం. ఈ విషయం కేసీఆర్‌కు తెలియనిది కాదు. ఇక వర్సిటీల హాస్టల్స్, మెస్‌‌లు అయితే కొత్త భవనాల నిర్మాణం జరగక, వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ధరలకు సరిపడా మెస్ చార్జీలను విడుదల చేయకపోవడంతో, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదు. ఇలా ప్రభుత్వం ప్రతి విషయంలో వర్సిటీలపై సవతి తల్లి ప్రేమను చూపెడుతున్నది. ఇది ముమ్మాటికీ తెలంగాణ కోసం విద్యార్థులు చేసిన త్యాగాలను వెక్కిరించినట్టు అవుతుంది. యూనివర్సిటీలకు నిధుల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి వహించకపోతే విద్యార్థుల ఆగ్రహజ్వాలలకు ఆహుతి కావాల్సి వస్తుంది. తెలంగాణ కోసం కొట్లాడిన స్ఫూర్తి ఇంకా సమసిపోలేదన్న విషయాన్ని కేసీఆర్(kcr) గుర్తెరిగి యూనివర్సిటీల సమస్యలు పరిష్కరించాలి.


తేజావత్ వెంకట్ నాయక్

ఉస్మానియా యూనివర్సిటీ

9014012381

Next Story

Most Viewed