ఒక ప్రమాదం.. నాలుగు స్కూళ్లలో విషాదం

by Bhoopathi Nagaiah |   (  Updated:2026-01-17 07:51:56  IST  )

ఒక రోడ్డు ప్రమాదం నాలుగు ప్రభుత్వ స్కూళ్లలో తీవ్ర విషాదాన్ని నింపింది. అలాగే రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని కలిగించింది.

ఒక ప్రమాదం.. నాలుగు స్కూళ్లలో విషాదం
X

దిశ, తుంగతుర్తి: సెలవుల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకొని శనివారం తిరిగి ప్రారంభమైన పాఠశాలలకు వస్తుండగా ఉపాధ్యాయుల కుటుంబాల్లో తీవ్రవిషాదం జరిగింది. ఈ ప్రమాదం నాలుగు కుటుంబాల్లో, నాలుగు పాఠశాలల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని వివిధ పాఠశాలల్లో విధులకు హాజరయ్యేందుకు వస్తున్న ప్రభుత్వ టీచర్ల మార్గమధ్యలో జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి) వద్ద ప్రమాదానికి గురికావడంతో ఈ విషాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు టీచర్లు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు.

విషాదంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు

టీచర్లు ప్రమాదానికి గురయ్యారని తెలియగానే ఆయా పాఠశాలల్లో విషాద ఛాయలు అములుకున్నాయి. అయ్యో... మా సార్లకు ఇంత ఘోరం జరిగిందా...? అంటూ పాఠశాల యాజమాన్యం, విద్యార్థులంతా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఉపాధ్యాయ లోకమంతా గొల్లుమంటుంది. వారం రోజుల క్రితం కలిసిమెలిసి తిరగడమే కాకుండా సెలవుల్లో కూడా క్షేమసమాచారాలను తెలుసుకుంటూ చివరికి ఇలాంటి చేదు వార్తలు వినాల్సి వస్తుందని వారంతా విషాద వదనంలో మునిగిపోయారు.

కేజీబీవీ ఎస్ఓ, హెచ్ఎం స్పాట్ డెడ్

తుంగతుర్తి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ప్రత్యేక అధికారి మామిడాల కల్పన ప్రమాదం జరిగిన సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఆమె పాఠశాలలో గత 13 నెలలుగా పనిచేస్తూ అందరితో కలివిడిగా ఉండేది. అలాగే రావులపల్లి గ్రామ జడ్పీహెచ్ఎస్ హెచ్ఎంగా పనిచేస్తున్న గీతారెడ్డిని హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు వదిలింది. ఈ ప్రమాదంలో తుంగతుర్తి జడ్పీహెచ్ఎస్ హెచ్ఎంగా పనిచేస్తున్న అల్వాల ప్రవీణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అన్నారం జడ్పీహెచ్ఎస్ హెచ్ఎంగా పనిచేస్తున్న అల్వాల సునీత ప్రమాదంలో గాయపడ్డారు. వీరంతా సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, సెక్టోరియల్ అధికారులు రాంబాబు, శ్రీనివాస్ తదితర అధికారులు క్షతగాత్రులను పరామర్శించారు.

వీరిద్దరూ అక్కాతమ్ముడు

ప్రమాదంలో గాయపడ్డ వారిలో అన్నారం గ్రామ హెచ్ఎం అల్వాల సునీత అక్క కాగా తుంగతుర్తి జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎంగా పనిచేస్తున్న అల్వాల ప్రవీణ్ కుమార్ ఆమెకు తమ్ముడు. ఒకే ప్రమాదంలో అక్కాతమ్ముడు తీవ్రగాయాలపాలై ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుండటం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. కాగా, ప్రమాదంలో మరణించిన గీతారెడ్డి తుంగతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్ఐ రవీందర్ రెడ్డికి దగ్గరి బంధువు.

Read More.. పాఠశాలకు వెళుతూ ప్రమాదానికి గురైన టీచర్లు.. ఒకరు మృతి

Next Story