ముగ్గురు కేంద్రమంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు.. ఆక్వా, పొగాకు రంగాలపై స్పెషల్ రిక్వెస్ట్

by Naga Rani Yarlagadda |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం నారా చంద్రబాబునాయుడు ముగ్గురు కేంద్రమంత్రులకు వేర్వేరుగా లేఖలు రాశారు.

ముగ్గురు కేంద్రమంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు.. ఆక్వా, పొగాకు రంగాలపై స్పెషల్ రిక్వెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం నారా చంద్రబాబునాయుడు ముగ్గురు కేంద్రమంత్రులకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఏపీ ఆక్వా, సోయాబీన్ దిగుమతులు, రాజధానిలో NFDB ఆఫీసు, DGFT ద్వారా ఫిష్ మీల్ ఎగుమతులపై లేఖల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో కీలకమైన ఆక్వా, పొగాకు రంగాలను ఆదుకోవడంతోపాటు పలు అభివృద్ధి పనుల గురించి ఈ లేఖల్లో ప్రస్తావించారు. ఏపీ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ రంగాల రక్షణకు వెంటనే కేంద్రం చొరవ చూపాలని ఆయా లేఖలలో సీఎం కోరారు.

రాష్ట్రంలో ఆక్వా కల్చర్‌ (రొయ్యలు, చేపల సాగు) తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో, ఆక్వా రంగాన్ని గట్టెక్కించేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఆక్వా మేత (ఫీడ్) తయారీ ఖర్చులను తగ్గించేందుకు వీలుగా విదేశాల నుంచి సోయాబీన్ మీల్ దిగుమతి చేసుకునేందుకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. అలాగే.. దేశీయ మార్కెట్‌లో సమతుల్యతను కాపాడేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ద్వారా 'ఫిష్ మీల్' ఎగుమతులను నియంత్రించాల్సిన అవసరం ఉందని లేఖలో స్పష్టం చేశారు. ఆక్వా రైతులకు మరింత మేలు జరిగేలా అమరావతిలో జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ (NFDB) ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రానికి ప్రతిపాదించారు.

మరోవైపు రాష్ట్రంలోని పొగాకు రైతులను, ఎగుమతిదారులను ఆదుకునేందుకు కేంద్రం చొరవ చూపాలని చంద్రబాబు కోరారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఏపీ బ్రాండ్‌ను బలోపేతం చేసేలా ఎఫ్‌సీవీ (FCV) పొగాకు ఎగుమతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. దీనితో పాటు, ప్రాసెస్ చేయని ముడి పొగాకుపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ (GST) శాతాన్ని తగ్గించడం ద్వారా అటు రైతులకు, ఇటు వ్యాపారులకు భారీ ఊరట లభిస్తుందని, దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ సానుకూల నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆ లేఖలో బలంగా డిమాండ్ చేశారు.

Next Story