కరీంనగర్‌లో భారీ బ్యాంకింగ్ స్కామ్: 8 అకౌంట్లు.. రూ.137 కోట్ల గోల్‌మాల్!

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-27 13:13:16  IST  )

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన మ్యూల్ అకౌంట్ల (Mule Accounts) కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు.

కరీంనగర్‌లో భారీ బ్యాంకింగ్ స్కామ్: 8 అకౌంట్లు.. రూ.137 కోట్ల గోల్‌మాల్!
X

దిశ కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన మ్యూల్ అకౌంట్ల (Mule Accounts) కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. అమాయకుల పేరిట బ్యాంక్ ఖాతాలు తెరిచి, వాటి ద్వారా వందల కోట్ల అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్న ముఠాను కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేయగా, మొత్తం 24 మంది ఈ స్కామ్‌లో భాగస్వాములైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ భారీ స్కామ్‌లో ఆర్బీఎల్ (RBL) బ్యాంక్ ఉద్యోగులు కల్యాణ్, ఆయేషాలు కీలక పాత్ర పోషించడం గమనార్హం. వీరిద్దరూ కలిసి బ్యాంకు నిబంధనలను ఉల్లంఘించి, క్రిప్టో కరెన్సీ లావాదేవీల కోసం మరియు అక్రమ డిపాజిట్ల కోసం మ్యూల్ అకౌంట్లను సృష్టించారు. కేవలం 2 శాతం కమీషన్ ఆశ చూపి అమాయకుల నుంచి వివరాలు సేకరించి, వారి పేరుతో ఖాతాలు తెరిచినట్లు విచారణలో తేలిందని కరీంనగర్ సీపీ గౌస్ అలాం స్పష్టం చేశారు.

8 అకౌంట్లు.. రూ.137 కోట్ల లావాదేవీలు..

నిందితులు కేవలం ఎనిమిది మ్యూల్ అకౌంట్లను ఉపయోగించి ఏకంగా రూ.137 కోట్ల మేర భారీ లావాదేవీలు జరిపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ నిధులను ప్రధానంగా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌కు మరియు విదేశీ ఖాతాలకు మళ్లించినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో బ్యాంక్ ఉద్యోగులు కల్యాణ్, ఆయేషాతో పాటు సాయిరాం, రంజిత్, మల్లేశం, సత్యం, బండి ప్రణయ్‌లు కీలక నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం ప్రధాన నిందితులు కల్యాణ్, ఆయేషాలను పోలీసులు కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నారు. ఈ స్కామ్‌లో ఇంకా ఏయే బ్యాంకుల అకౌంట్లు ఉన్నాయి? ఈ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి మళ్లింది? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. పరారీలో ఉన్న మిగిలిన 11 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఉమ్రా పేరుతో నిలువు దోపిడీ: రూ. 4 కోట్లతో పాతబస్తీ కిలాడీ పరార్!

Next Story