- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్కే మళ్లీ పట్టం.. బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదన్న ఆది శ్రీనివాస్
బస్సు యాత్ర, పాదయాత్ర అని కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని, కేసీఆర్ బస్సుయాత్ర చేసినా, కేటీఆర్ పాదయాత్ర, హరీశ్ రావు మోకాళ్ల యాత్ర చేసినా ఉపయోగం లేదని ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : బస్సు యాత్ర, పాదయాత్ర అని కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని, కేసీఆర్ బస్సుయాత్ర చేసినా, కేటీఆర్ పాదయాత్ర, హరీశ్ రావు మోకాళ్ల యాత్ర చేసినా ఉపయోగం లేదని ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ పాదయాత్ర చేసినా, పోర్లు దండాలు పెట్టినా, వెక్కి వెక్కి ఏడ్చినా జనం నమ్మరని, అధికారం ఉన్నప్పుడు హెలికాఫ్టర్లు, బెంజ్ కార్లు, ఫాంహౌస్లు, విల్లాల్లో అనుభవించిన రాజభోగాలు తెలంగాణ ప్రజలకు తెలుసు అని ఆయన విమర్శించారు. కేటీఆర్, పాదయాత్రలు కావు ముందు మీ అయ్యను ఫాంహౌస్ నుంచి బయటకు తీసుకురా.. ప్రతిపక్ష నాయకుడిగా జీతం తీసుకుంటూ ఫాంహౌస్లో కాలక్షేపం చేస్తున్నాడని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. అధికారం ఉన్నప్పుడు ప్రగతిభవన్ దాటలేదు.. ఫాంహౌస్ ను వదిలిపెట్టలేదని, అధికారం పోయాక బస్సు యాత్ర చేస్తే కేటీఆర్ ను ఎవరు నమ్ముతారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బస్సుయాత్రతో జిల్లాల పర్యటనలు చేస్తానని కేసీఆర్ అనేక సార్లు గప్పాలు కొట్టాడని, ఏ ఒక్క రోజు ప్రజలను కలిసింది లేదు.. అందుకే జనం కర్రు కాల్చి వాత పెట్టారని ఆది శ్రీనివాస్ విమర్శించారు.
ముందు నీకు ఏ స్థానం ఇచ్చారో తెలుసుకో!
కాంగ్రెస్కు మూడో స్థానం వస్తుందని కేటీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నాడని, ముందు నీకు జనం ఏ స్థానం ఇచ్చారో తెలుసుకో, ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా మీకు బుద్దిరావడం లేదని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికలు, ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో మీ పార్టీ పరిస్థితి ఏంటో తెలిసిందని, భవిష్యత్తులో నీ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు ఉండరన్నారు. వంద స్థానాల్లో డిపాజిట్ రాని బీజేపీకి తమతో పోటీ ఉంటుందని కేటీఆర్ అంటున్నాడని, దీంతో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు అర్థమౌతున్నాయని ఆయన ఆరోపించారు. మీరిద్దరు కట్టకట్టుకుని వచ్చినా, విడి విడిగా వచ్చినా మమ్మల్ని తెలంగాణ నుంచి ప్రలు పారదోలడం ఖాయమని, మరో సారి సీఎంగా రేవంత్ రెడ్డికి పట్టం కట్టడం ఖాయమన్నారు. ఫ్యూచర్ సిటీ ని చూసి కేటీఆర్ గుండెల్లో దడ పుడుతోందని ఆది శ్రీనివాస్ అన్నారు.






