ప్రధాని పర్యటన వేళ భారీ అగ్ని ప్రమాదం.. 20 ఫైరింజన్లతో సహాయక చర్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-20 13:09:29  IST  )

రాజస్థాన్‌లోని పచ్‌పద్ర (Pachpadra)లో ఉన్న HPCL రాజస్థాన్ రిఫైనరీలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

ప్రధాని పర్యటన వేళ భారీ అగ్ని ప్రమాదం.. 20 ఫైరింజన్లతో సహాయక చర్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్‌లోని పచ్‌పద్ర (Pachpadra)లో ఉన్న HPCL రాజస్థాన్ రిఫైనరీలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మరికొద్ది గంటల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రిఫైనరీని ప్రారంభించాల్సి ఉండగా, ఈ ప్రమాదం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. రిఫైనరీలోని ఒక యూనిట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భారీగా నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేసింది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్లాంట్లోని కార్మికులను సురక్షితంగా బయటకు తరలించారు. దాదాపు 20 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మంటల తీవ్రత దృష్ట్యా కోట్ల రూపాయల విలువైన యంత్రసామగ్రి కాలిపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది, అయితే అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

ఆందోళనలో అధికార యంత్రాంగం..

ఏప్రిల్ 21న (మంగళవారం) ప్రధాని మోడీ ఈ రూ. 79,450 కోట్ల మెగా ప్రాజెక్టును జాతికి అంకితం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు (SPG), ఉన్నతాధికారులు ఇప్పటికే అక్కడ విధుల్లో ఉన్నారు. పకడ్బందీ భద్రత ఉన్నప్పటికీ, ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు ఇలాంటి ప్రమాదం జరగడంతో సాంకేతిక కారణాలు లేదా భద్రతా లోపాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి మంటలను ఇతర యూనిట్లకు వ్యాపించకుండా అరికట్టడమే లక్ష్యంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం కారణంగా రేపటి ప్రధాని పర్యటనలో ఏవైనా మార్పులు ఉంటాయా అనే దానిపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

రాజస్థాన్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం: ప్రధాని మోడీ పర్యటన రద్దు, ప్రారంభోత్సవం వాయిదా

Next Story