- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్తను చంపేందుకు ప్రియుడితో పక్కా స్కెచ్: తీరా చూస్తే.. సీన్ అంతా రివర్స్!
వడోదరలో హారర్ సినిమాను తలపించే హత్యాయత్నం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను కిడ్నాప్ చేయించి, కాలువలో పడేయించిన ఘటన కలకలం రేపుతోంది.

దిశ, వెబ్డెస్క్: వివాహేతర సంబంధం ఎంతటి దారుణానికైనా ఒడిగడుతుందని చెప్పడానికి వడోదరలో జరిగిన ఈ ఘటనే నిదర్శనంగా నిలిచింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపేందుకు ఓ భార్య ఏకంగా సుపారీ గ్యాంగ్ను ఆశ్రయించింది. కానీ విధి మరోలా తలచడంతో చావు అంచుల వరకు వెళ్లిన భర్త ప్రాణాలతో తిరిగి వచ్చి నిందితుల తాట తీశాడు. వివరాల్లోకి వెళితే.. వడోదర (Vadodara)లోని ఛానీ (Chani) ప్రాంతంలో గిరీష్ పటేల్ (Girish Patel) అనే వ్యక్తి పాన్ పార్లర్ నడుపుతున్నాడు. ఏప్రిల్ 15న రాత్రి పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా కొందరు వ్యక్తులు అతడిని కారులో కిడ్నాప్ చేశారు. కత్తితో బెదిరించి వివిధ ప్రాంతాల్లో తిప్పిన తర్వాత, సోజిత్ర సమీపంలోని ఒక కాలువలో పడేశారు. గిరీష్ చనిపోయాడని భావించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
మూడు గంటల మృత్యుపోరాటం..
కాలువలో పడిపోయిన గిరీష్.. అదృష్టవశాత్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోకుండా అక్కడ ఉన్న ఒక నిర్మాణాన్ని గట్టిగా పట్టుకున్నాడు. సుమారు మూడు గంటల పాటు ప్రాణాల కోసం పోరాడి, మరుసటి రోజు ఉదయం ఒడ్డుకు చేరుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. గిరీష్ భార్య ఫల్గుణి పటేల్ (Falguni Patel)కు ఖేడాకు చెందిన సెలూన్ యజమాని కౌశిక్ శర్మ (Kaushik Sharma)తో అక్రమ సంబంధం ఉంది. గిరీష్ అడ్డు తొలగించుకుంటే తాము హాయిగా ఉండొచ్చని భావించిన వీరిద్దరూ హత్యకు ప్లాన్ వేశారు. ఈ మేరకు కౌశిక్ శర్మ తన స్నేహితుడు నికుల్ గోస్వామికి హత్య చేసేందుకు రూ.35 వేల సుపారీ ఇచ్చాడు. ఘటనా జరిగిన రెండు రోజుల ముందు ఫల్గుణి, కౌశిక్ మధ్య ఏకంగా 100కు పైగా ఫోన్ కాల్స్ నడిచినట్లుగా పోలీసులు గుర్తించారు.
ఆరుగురు నిందితుల అరెస్ట్..
సాంకేతిక ఆధారాలు, గిరీష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు కౌశిక్ శర్మ, జితేంద్ర బారియా, ఉమంగ్ ప్రజాపతి, ఉమంగ్ భోయ్, పృథ్వీ భోయ్లను అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి అయిన భార్య ఫల్గుణిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.






