హాట్ టాపిక్‌గా సీఎం జగన్ డెసిషన్.. 2022లోనే రంగంలోకి పీకే టీం..

by  |
హాట్ టాపిక్‌గా సీఎం జగన్ డెసిషన్.. 2022లోనే రంగంలోకి పీకే టీం..
X

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారా..? ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సూచనల వెనుక ఆంతర్యం ఏంటి..? 2022లోనే పీకే టీం రంగంలోకి దించడం ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగమేనా..? వైసీపీపై వ్యతిరేకత పెరగకముందే ఎన్నికల బరిలోకి దిగాలనే యోచనలో జగన్ ఉన్నారా..? రెండున్నరేళ్ల పాలన పూర్తికాకుండా ఎన్నికలపై అలర్ట్‌గా ఉండాలంటూ కేబినెట్ భేటీలో సూచించడం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా ? లేక టార్గెట్ 2024 లక్ష్యంగా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించడంలో భాగమేనా అన్నదానిపై ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అనేది హాట్ టాపిక్‌గా మారింది.

సంచలనంగా జగన్ పిలుపు..

‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనునేను’ అన్న పదం వినిపిస్తే చాలు 2019 మే 30 గుర్తుకు వస్తోంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. అభిమానులు ఇప్పటికీ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన స్పీచ్‌ ఇంకా వారి చెవుల్లో మార్మోగుతూనే ఉంది. ఇంకా రెండున్నరేళ్లు కూడా జగన్ పాలన పూర్తికాలేదు. ఇలాంటి తరుణంలో సీఎం జగన్ అప్పుడే టార్గెట్ 2024 దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర విభజనతో రాష్ట్రం ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతోంది.

దానికితోడు కరోనా వైరస్ విపత్కర పరిస్థితి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వెనక్కునెట్టింది. అయినప్పటికీ సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయడంతోపాటు.. మేనిఫెస్టోలో పొందుపరచని హామీలను సైతం అమలు చేశారు. సుమారు లక్షల కోట్లు ప్రభుత్వ పథకాలకే కేటాయించారు. విపత్కర పరిస్థితుల్లో కూడా పథకాలు అమలు చేసేందుకు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. దీంతో ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఇలాంటి తరుణంలో సీఎం జగన్ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునివ్వడం సంచలనంగా మారింది.

గడపగడపకు కార్యక్రమం ప్రారంభించండి..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని సూచించారు. పింఛన్లు, రేషన్‌కార్డుల విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను మంత్రులు, ఎమ్మెల్యేలు తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. పెన్షనర్ల జాబితాపై ప్రజలకు మరింత స్పష్టత నివ్వాలని సూచించారు.

అర్హులకు మేలు జరిగేలా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని ప్రజలకు వివరించాలని..ప్రభుత్వం పారదర్శకంగా పాలన సాగిస్తోందన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సీఎం సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విపక్షాలు చేస్తున్న రాద్ధాంతం, కుట్రలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవులు పొందిన ప్రతీ ఒక్కరూ గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని సూచించారు.

కేబినెట్‌లో 80శాతం మంత్రులు ఎన్నికల కోసమే..

టార్గెట్ 2024 లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే కార్యచరణ మెుదలు పెట్టాలని సీఎం జగన్ కేబినెట్ భేటీలో సూచించారు. ప్రతీ ఎమ్మెల్యే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. నిత్యం ప్రజలతోనే ఉంటూ..ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న కేబినెట్‌లో 80శాతం మంత్రులను ఎలక్షన్‌ టీమ్‌కు ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ ప్రక్రియ అంతా వచ్చే మే నెల నుంచి ప్రారంభం కాబోతుందని చెప్పుకొచ్చారు.

రంగంలోకి ఎన్నికల వ్యూహకర్త పీకే..

2024లో జరగబోయే ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తారని సీఎం జగన్ మంత్రులకు తెలియజేసినట్లు తెలుస్తోంది. పీకే బృందం 2022కల్లా రాష్ట్రానికి వస్తుందని సీఎం జగన్ తెలిపారు. ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై పీకే బృందం ఇచ్చే సూచనలను ప్రతీ ఒక్క ఎమ్మెల్యే పరిగణలోకి తీసుకోవాలని సీఎం హితబోధ చేశారు. అలాగే విపక్షాలు విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టేలా మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యచరణ సిద్ధం చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు.

ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం.?

రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. అంతేకాదు రెండేళ్ల సీఎం జగన్ పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆర్థికలోటుతో సతమతమవుతున్నా.. కరోనా ఇబ్బందులు ఉన్నా జగన్ సర్కార్ ఏమాత్రం ఆలోచించకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను దాదాపు 80శాతానికిపైగా అమలు చేసినట్లు వైసీపీ నేతలు చెప్తున్నారు. రాష్ట్ర ప్రజలే కాదు జాతీయ మీడియా సైతం జగన్ పాలనను శభాష్ అంది.

ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రుల జాబితాలోని టాప్-5లో చోటు దక్కించుకున్నారు. అయితే రాను రాను పరిస్థితులు మారుతున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకతతోపాటు విపక్షాలు బలపడుతున్నాయి. ఇటీవలే రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ చేపట్టిన ఉద్యమం ప్రభుత్వాన్ని ఓ కుదుపుకుదుపేసింది. అదే తరుణంలో రైతుకోసం తెలుగుదేశం వంటి కార్యక్రమాలతో టీడీపీ నిరసనలకు దిగుతున్నది. అలాగే పోలవరం ముంపు బాధితుల పక్షాన టీడీపీ చేసిన పోరాటం ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అలాగే మహిళలపై జరుగుతున్న ఘోరాలపై టీడీపీతోపాటు విపక్షాలు చేస్తున్న నిరసనలు వైసీపీకి కంటిపై కునుకులేకుండా చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే దానిపై కసరత్తు చేస్తున్నారా? అనే దానిపై పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతున్నది.

ఇది కూడా చదవండి :

బిగ్ బ్రేకింగ్.. చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత..



Next Story

Most Viewed