ఈ ఏడాది అమ్మకాల్లో రెండంకెల వృద్ధి ఖాయం: మెర్సిడెస్ బెంజ్!

by Disha Web Desk 13 |
ఈ ఏడాది అమ్మకాల్లో రెండంకెల వృద్ధి ఖాయం: మెర్సిడెస్ బెంజ్!
X

న్యూఢిల్లీ: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఈ ఏడాది భారత మార్కెట్లో రెండంకెల వృద్ధిని సాధించనున్నట్టు తెలిపింది. డాలర్ కంటే రూపాయి కరెన్సీ బలహీనపడుతున్న కారణంగా కార్ల ధరలు పెరిగినప్పటికీ మెరుగైన అమ్మకాలను సాధించగలమనే విశ్వాసం ఉందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ అయ్యర్ అన్నారు. గతేడాది కంపెనీ దేశీయ ఆటో పరిశ్రమలో 41 శాతం అమ్మకాల వృద్ధితో 15,822 కార్లను విక్రయించామని, ఇది కంపెనీ భారత కార్యకలాపాల చరిత్రలోనే ఇవి అత్యధిక విక్రయాలు కావడం విశేషమని ఆయన తెలిపారు.

ప్రస్తుతానికి కంపెనీ ఇంకా 6,000 కార్లకు పైగా ఆర్డర్లని కలిగి ఉంది. బలహీన పడుతున్న రూపాయి కరెన్సీ వల్ల దిగుమతి చేసుకునే విడి పరికరాలతో కార్ల ధరను పెంచాల్సి వస్తోందని, ఇదొక్కటే ప్రస్తుతానికి భారత లగ్జరీ కార్ల మార్కెట్‌కు విఘాతంగా ఉందని సంతోష్ అయ్యర్ పేర్కొన్నారు. దిగుమతి పరికరాల భారం రానున్న రోజుల్లోనూ పెరిగితే కార్ల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గతేడాది రూపాయి విలువ డాలర్ కంటే 10 శాతం పడిపోయింది. ఇది 2013 తర్వాత అత్యంత దారుణమైన పతనం కావడంతో పాటు ఆసియాలోనే చెత్త కరెన్సీగా నిల్వడం గమనార్హం.

ఇవి కూడా చదవండి : ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వాహన మార్కెట్‌గా భారత్!


Next Story

Most Viewed