టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ న్యాయ పోరాటం తెలుసా..

by Disha Web Desk 16 |
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ  న్యాయ పోరాటం తెలుసా..
X

ముంబై: దేశీయ అతిపెద్ద గ్రూప్ సంస్థ టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కన్ను మూశారు. ఆదివారం మహారాష్ట్రలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తున్న క్రమంలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగ్గా, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో సైరస్ మిస్త్రీ అక్కడిక్కడే మృతి చెందారు. వంతెనపై డివైడర్‌ను కారు ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వాహనంలో మొత్తం నలుగురు ఉండగా వారిలో మిస్త్రీతో పాటు మరొకరు చనిపోయారు. మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. సైరస్ మిస్త్రీకి భార్య రోహిఖా చగ్లా, ఫిరోజ్‌ మిస్త్రీ, జహన్‌ మిస్త్రీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

1968, జూలై 4న ముంబైలో జన్మించిన సైరస్ మిస్త్రీ దేశ నిర్మాణ రంగంలో పేరున్న పల్లోంజీ మిస్త్రీ, పాస్టీ పెరిన్‌లను జన్మించారు. పల్లోంజీ మిస్త్రీకి సైరస్ మిస్త్రీ చిన్న కుమారుడు. మిస్త్రీ తల్లి ఐర్లాండ్‌కు చెందిన వ్యక్తి. దక్షిణ ముంబైలో కేథడ్రల్ అండ్ జాన్‌కానన్ పాఠశాలలో ప్రాథమిక విధ్యనభ్యసించిన సైరస్ మిస్త్రీ, 1990లో సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్నారు. ఆ తర్వాత లండన్ బిజినెస్ స్కూల్‌లో మాస్టర్స్‌ను పూర్తి చేశారు. 1991లో కుటుంబ వ్యాపారాలను నిర్వహించేందుకు షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీలో డైరెక్టర్ హోదాలు చేరారు. అనంతరం 2006లో టాట సన్స్‌కు డైరెక్టర్‌గా చేసిన ఆయన, 2011, నవంబర్‌లో సంస్థ డిప్యూటీ ఛైర్మన్‌గా మారారు.

అలాగే, టాటా స్టీల్, టాటా టెలీసర్వీసెస్, టాటా ఇండస్ట్రీస్, టాటా పవర్, టీసీఎస్ కంపెనీలకు కూడా సైరస్ మిస్త్రీ డైరెక్టర్‌గా పనిచేశారు. 142 ఏళ్ల టాటా గ్రూపునకు నాయకత్వం వహించిన టాటా కుటుంబం బయటి రెండో వ్యక్తి అయిన మిస్త్రీ సంస్థలో తన పదవిని నాలుగేళ్లు మాత్రమే కొనసాగించగలిగారు. 2012లో టాటా గ్రూప్ ఛైర్మన్‌గా రతన్ టాటా పదవీ విరమణ పొందిన తర్వాత సైరస్ మిస్త్రీ ఆ బాధ్యతలను చేపట్టారు. అప్పటికి షాపూర్‌జీ పల్లోంజీ గ్రూపులో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. టాటా సన్స్ హోల్డింగ్స్‌లో షాపూర్‌జీ పల్లోంజీ గ్రూపునకు 18 శాతం వాటా ఉంది. అయితే టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న నాలుగేళ్లకే సైరస్ మిస్త్రీని సంస్థ తొలగించింది. సంస్థ లక్ష్యాలను చేరుకోవడంలో సైరస్ మిస్త్రీ విఫలమయ్యారని, ఆయన అనుసరించే విధానం టాటా గ్రూప్ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని కారణాలుగా ఉంచింది.

కానీ, సైరస్ మిస్త్రీ ఈ వ్యవహారంలో చట్టపరంగా పోరాడేందుకు సిద్ధమయ్యారు. టాటా సన్స్‌లో 18.4 శాతం వాటా ఉన్న మిస్త్రీ తన తొలగింపును సవాలు చేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రెబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ)కి వెళ్లారు. రతన్ టాటా సహా గ్రూపులోని 20 మందిపై సైరస్ ఇన్వెస్ట్‌మెంట్స్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కంపెనీల తరపున కేసు వేశారు. కానీ, ఈ ఆరోపణలు పరిశీలించేందికు అర్హత కావని ఎన్‌సీఎల్‌టీ తేల్చి చెప్పింది. అప్పటికీ వెనకడుగు వేయని సైరస్ మిస్త్రీ, ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలను కూడా సవాలు చేస్తూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్(ఎన్‌సీఎల్ఏటీ)కి వెళ్లారు. మూడేళ్ల తర్వాత సైరస్ మిస్త్రీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా మిస్త్రీని తిరిగి నియమించాలని ఆదేశాలివ్వగా, ఆ తర్వాత 2021, మార్చి 26న సుప్రీంకోర్టును దీన్ని తోసిపుచ్చింది.

టాటా గ్రూప్ మాజీ చైర్మన్ Cyrus Mistry దుర్మరణం

Next Story