సర్వేల్లో కేసీఆర్‌కు ఊహించని షాక్.. టీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్

by  |
TRS vijaya garjana sabha
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రులు మళ్లీ గెలిచే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రస్తుతం కేబినెట్‌లో సీఎంతో సహా 17 మంది ఉండగా.. వీరిలో ఇద్దరు ఎమ్మెల్సీలు. మిగిలిన వారిలో కేవలం ఐదుగురు మాత్రమే వచ్చే ఎన్నికలు గెలుస్తారని సీఎం సర్వేల్లో తేలినట్లు సమాచారం. ఇప్పటికే 41 మంది ఎమ్మెల్యేలు మళ్లీ గెలిచే అవకాశం లేదని, వారికి టికెట్​ఇవ్వడం కష్టమేనని గులాబీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతుండగా.. తాజాగా మంత్రుల అంశం తెరపైకి వచ్చింది. కేబినెట్‌లోని కేవలం ఐదుగురు మాత్రమే గెలుస్తారని సీఎం కేసీఆర్​ చేస్తున్న ముందస్తు సర్వేలో వెల్లడైనట్లు ప్రగతిభవన్​ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

వివాదాలతో వెనకంజ..

ఇటీవల రాష్ట్ర మంత్రుల వ్యవహారం వివాదాస్పదంగా మారుతున్నది. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఇద్దరు మంత్రుల రాసలీలల విషయం సోషల్​మీడియాలో వైరల్ అయ్యాయి. పార్టీ వర్కింగ్​ప్రెసిడెంట్ చలువతో మంత్రి అయినట్లు చెప్పుకునే సదరు మంత్రి రాసలీలల వీడియో ఏకంగా సీఎం కేసీఆర్​వద్దకే చేరిందని సమాచారం. ఇలా పలువురు మంత్రులు అడపాదడపా వివాదాల్లోకి వస్తూనే ఉన్నారు. మహిళా అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసి కూడా వార్తల్లోకెక్కారు.

వ్యతిరేకత.. అవినీతి ఆరోపణలు

కేబినెట్ మంత్రులపై అవినీతి, ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి.. తరుచూ భూ వివాదాల్లోకెక్కుతున్నారు. సదరు మంత్రి కుటుంబ సభ్యుడితో భూ దందాలు సాగిస్తున్నారనే ఫిర్యాదు అదే జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రగతిభవన్‌కే అందించారు. అంతేకాకుండా ఓ కుటుంబం కూడా గతంలో ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి కూడా ఇలాంటి వివాదాలనే ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్​శివారు జిల్లాకు చెందిన ఓ మంత్రి.. రియల్ వ్యాపారంలో బెదిరింపులు బయటకు వచ్చాయి. కోట్లు ఖర్చు పెట్టి మంత్రి పదవి కొనుక్కున్నట్లు కూడా ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అమాత్యుల వ్యవహారశైలితో సొంత నియోజకవర్గాల్లో ప్రజలకు దూరమవుతున్నట్లు సర్వేల్లో తేలింది.

ఇటీవల సీఎం కేసీఆర్ పలు సంస్థలతో వరుస సర్వేలు చేయించినట్టు తెలిసింది. కేసీఆర్​సంక్షేమ పథకాలపై కొంత మేరకు అనుకూలత ఉన్నా.. ఈ మంత్రుల వ్యవహారంతో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నట్లు సర్వేలో గుర్తించారు. ఉద్యమం నుంచి వెన్నంటి ఉన్న వారిని పక్కన పెట్టడం, ఇతర పార్టీల్లో ఉన్న వారికి పెద్దపీట వేయడం వంటి వాటితో స్థానిక లీడర్లతో కూడా మంత్రులకు దూరం పెరిగిందంటున్నారు. పలు సందర్భాల్లో మంత్రులు కూడా మాటలు తూలుతున్నారు. సొంత పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా నియోజకవర్గాల్లో పట్టు కోల్పోతున్నారు.

మారడం లేదా..?

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా అధికార పార్టీ నాయకుల వైఖరిలో మార్పు రావడం లేదు. పరిపాలకులుగా పెద్దన్న పాత్ర పోషించాల్సిన హోదాలో వారు చేస్తున్న వ్యాఖ్యలు, ప్రతిపక్షాలు, గిట్టనివారిపై తీసుకుంటున్న చర్యలు నిశితంగా పరిశీలిస్తే ఉద్యమ భావజాలం నుంచి వారింకా బయటకు రానట్టే కనిపిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమ ప్రస్థానంలో ఉపన్యాసాల్లో ఉన్న దూకుడే నేటికీ.. అధికారంలో ఉండి కూడా చాలా మంది ప్రదర్శిస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నామన్న విషయాన్ని పక్కనపెట్టి అధికారదర్పంతో ఉండటం, స్థానిక నేతలను పట్టించుకోకపోవడం, హుందాతనం ప్రదర్శించకపోవడం విమర్శలకు దారి తీస్తున్నది. దీంతో మంత్రుల వ్యవహారశైలిని వారి నియోజకవర్గాల్లోనే తప్పుపడుతున్నారు. అహంతో మాట్లాడుతున్నారన్న భావన కూడా ప్రజల్లో వ్యక్తం అవుతున్నది.

ఐదుగురికే గెలుపు..

కేబినెట్‌లో సీఎం కేసీఆర్‌తో పాటు మరో నలుగురు మంత్రులు మాత్రమే గెలుస్తారని సర్వే నివేదికలు తేల్చినట్లు తెలుస్తున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ మంత్రి, ఉమ్మడి మెదక్ నుంచి మరో మంత్రి, ఉమ్మడి వరంగల్ నుంచి ఇంకో మంత్రి, ఉమ్మడి పాలమూరు నుంచి మరో మంత్రి మాత్రమే గెలుస్తారని, మిగిలిన 12 మందిలో ఇద్దరు ఎమ్మెల్సీలను పక్కనపెడితే 10 మంది మంత్రులు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఓటమిపాలవుతారని తేలింది. వీరిలో కొందరు మంత్రులు నిత్యం నియోజకవర్గాల చుట్టూ తిరుగుతున్నా.. స్థానిక సమస్యలు తీర్చడంలో విఫలమవుతున్నారు.

సంక్షేమ పథకాలు, వైద్యానికి ఎల్‌ఓసీలు, సీఎం రిలీఫ్ ఫండ్​ వంటి వాటిని ఇప్పించడంలో అమాత్యులు ముందుంటున్నా.. చాలా అంశాల్లో వెనకబడుతున్నారు. ఉద్యమ సమయంలో వ్యవహరించిన తీరు, ఇప్పుడు మంత్రి హోదాలో మాట్లాడుతున్న వ్యాఖ్యలతో సొంత సెగ్మెంట్లలో వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. మంత్రులపై వ్యతిరేకత పెరుగుతున్నట్లు సర్వేల్లో స్పష్టత వచ్చినట్లు సమాచారం. దీంతో మంత్రులకు కూడా టికెట్లు ఇస్తారా.. ఓడిపోతారని సర్వేల్లో వ్యక్తమవుతుండటంతో వారికి కూడా బ్రేక్ వేస్తారా అనేది రాష్ట్రంలో ఆసక్తిగా మారింది.

చై-సామ్ డివోర్స్ ఆమెకు ముందే తెలుసా.. హాట్ టాపిక్‌గా శిల్పారెడ్డి.

Next Story