టీడీపీ జాబితాలో ఈ సారి క్లాస్ - మాస్.. జోష్‌లో టీడీపీ శ్రేణులు

by Disha Web Desk 2 |
టీడీపీ జాబితాలో ఈ సారి క్లాస్ - మాస్.. జోష్‌లో టీడీపీ శ్రేణులు
X

క్లాస్ లీడర్‌గా ఎంపీ కృష్ణదేవరాయలు.. మాస్ నాయకుడిగా జూలకంటి బ్రహ్మారెడ్డి.. అందరికీ సుపరిచితమే. మాచర్ల నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. క్లాస్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వైసీపీని వీడి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నరసరావుపేట నుంచి పోటీ చేయనున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లిని ఢీకొట్టి పసుపు జెండా రెపరెపలాడిస్తుందనటంలో సందేహం లేదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.

దిశ, మాచర్ల: క్లాస్.. మాస్ లీడర్ల కాంబినేషన్‌లో మాచర్ల రాజకీయం రసవత్తరంగా మారనుంది. లావు కృష్ణదేవరాయలు 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటినుంచి తనకంటూ రాజకీయాల్లో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరపరచుకున్నారు. గడిచిన 58 నెలల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి అభివృద్ధి అంటే ఏమిటో ఎలా ఉంటుందో చూపించారు. అలాంటి కృష్ణదేవరాయలు ఏ పార్టీలో ఉంటే తమకేమిటి ప్రజల బాగోగులను, తన బాగోగులుగా చూసుకుంటాడని భరోసా కల్పించాడని ప్రజలకు నమ్మకం కలిగింది. ఈ నేపథ్యంలో అనివార్య కారణాలతో వైసీపీని వీడిన కృష్ణదేవరాయలు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆరోజు కూడా తనకు పల్నాడు ప్రాంతంపై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. పూర్తి చేయాల్సిన పనులు సైతం ‘రా కదలిరా’ వేదికగా చంద్రబాబుకి వివరించారు. పూర్తిస్థాయిలో పల్నాడు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని చంద్రబాబు హామీని కూడా తీసుకున్నారు.

నిబద్ధత కలిగిన యువనేత..

అటువంటి నిబద్ధత నిజాయితీ కలిగిన నేత లావు కృష్ణదేవరాయలు 2024 ఎన్నికల్లో టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నరసరావుపేట నుంచి పార్లమెంటు‌కు పోటీలో నిలవనున్నారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలో వినుకొండ, మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట, పెదకూరపాడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అయితే కృష్ణదేవరాయలకు మాత్రం మాచర్ల ప్రజలపై అపార అభిమానం ఉంది. ఆ ప్రాంత ప్రజలు కృష్ణమ్మ చెంత ఉన్న, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎగువన ఉన్న చుక్క నీరు తాగేందుకు సాగు చేసేందుకు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి పడే ఇబ్బందులను తీర్చేందుకు వరికపూడిశెల ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థాయిలో కేంద్ర అనుమతులతో పాటు అటవీ శాఖ అనుమతులు కూడా తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే నాలుగు మండలాల రైతులు సుభిక్షంగా ఉంటారని వారి శ్రేయస్సు కోసం ఆయన కృషి ఎనలేనిదిగా ఈ ప్రాంత వాసులు పేర్కొంటున్నారు. ఇంత మంచి గుర్తింపు ఉన్న నేత కృష్ణదేవరాయలుకు తోడుగా మాచర్లలో మాస్ లీడర్ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ని ఉమ్మడి కూటమి అభ్యర్థిగా చంద్రబాబు బరిలో దించారు.

బ్రహ్మారెడ్డి రాకతో శ్రేణుల్లో పునరుత్తేజం

బ్రహ్మానందరెడ్డి అడుగుపెట్టింది మొదలు మాచర్లలో టిడిపి శ్రేణులకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. కార్యకర్తలకు ప్రతి విషయంలోనూ తోడుగా నిలుస్తున్నారు. సరైన అభ్యర్థి లేక మాచర్లలో కొన్నియేళ్లుగా టిడిపి జెండా రెపరెపలు నిలిచిపోయాయి. కానీ బ్రహ్మారెడ్డి రాకతో మళ్లీ శ్రేణుల్లో పునరుత్తేజం మొదలైంది. పసుపు జెండాతో రోడ్డు పైకి వచ్చి ఎన్టీఆర్ జయంతి వర్ధంతిలు చేయాలన్నా భయపడిన టీడీపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. కార్యకర్తలు చేయి చేయి కలిపి పసుపు జెండా ఎగరేసేందుకు మాచర్లలో సిద్ధమయ్యారు. గ్రామ గ్రామాన టిడిపిలో చేరికలు మొదలయ్యాయి. పార్టీ కార్యక్రమాలను బ్రహ్మారెడ్డి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళుతున్నారు. ఆత్మీయ సమావేశాలతో అసంతృప్తులను దగ్గరగా చేసుకుంటున్నారు. క్యాడర్‌ను మరింత బలోపేతం చేస్తూ బ్రహ్మారెడ్డి ముందుకు సాగుతున్నారు.

రసవత్తరంగా రాజకీయం...

2004 నుంచి 2024 వరకు టిడిపి జెండా మాచర్లలో ఎగరలేదు. 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 నుంచి 2024 వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల శాసనసభ్యులుగా గెలుపొందుతూ వస్తున్నారు. ఇప్పటివరకు టిడిపికి వ్యతిరేక పవనాలు వీచిన మాచర్లలో తిరిగి బ్రహ్మారెడ్డి రాకతో అనుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని శ్రేణులు పేర్కొంటున్నారు. ఇటువంటి క్లాస్ మాస్ లీడర్ల కాంబినేషన్‌లో మాచర్ల రాజకీయం రసవత్తరంగా మారనుంది.

Read More..

జనసేన తరపున గంటా పోటీ?.. ఆ నియోజకవర్గంపై ఫోకస్

Next Story

Most Viewed