దేశ నిర్మాణంలో చురుకైన భాగస్వాములుగా చేద్దాం : సీఎం

by Thanuru Gopichand |   (  Updated:2026-01-24 05:44:37  IST  )

జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రముఖుల శుభాకాంక్షలు.

దేశ నిర్మాణంలో చురుకైన భాగస్వాములుగా చేద్దాం : సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ఆడబిడ్డలను చురుకైన భాగస్వాములుగా చేద్దామని పిలుపునిచ్చారు. జీవితంలో విజయాలను సాధించేందుకు ఆడబిడ్డలకు సమాన అవకాశాలు వచ్చినప్పుడు, వారు సాధికారతను సాధించినప్పుడు, వారికి భద్రత లభించినప్పుడు మాత్రమే సమాజం ప్రగతి పథంలో సాగుతుందన్నారు. బాలికల అభ్యున్నతి కోసం వారికి సమాన అవకాశాలు లభించేలా భరోసాను కల్పిద్దామని సీఎం అన్నారు. వారి లక్ష్యాలను సాధించే శక్తి సామర్థ్యాలను సమకూర్చుకునేందుకు బాలికలకు తోడ్పాటునిద్దామని కోరారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రతి ఆడబిడ్డకు కాపాడడానికి, చైతన్యవంతులను చేయానికి, వారిని సశక్తులగా మార్చడానికి ఏకమవుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆడబిడ్డలకు లభించే గౌరవం, అవకాశాలు, విశ్వాసం దేశ శక్తి సామర్థ్యాలను ప్రతిబింబిస్తాయన్నారు. ఆడబిడ్డ అభ్యున్నతితో పాటు దేశ అభ్యున్నతి సాకారం అవుతుందని తెలిపారు.

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ బాలికలే భవిష్యత్ దీపికలు అని అన్నారు. వారికి అవకాశాలను కల్పిస్తే ఆకాశమే హద్దుగా రాణిస్తారన్నారు. బాలికల హక్కుల పరిరక్షణకు, విద్య, భద్రత కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బాలికల పట్ల వివక్షను విడనాడుదామని, వారికి సమాన అవకాశాలు కల్పిద్దామని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ బాలికల దినోత్సవం శుభాకాంక్షలను తెలియజేశారు.

Read More..

ఆడబిడ్డల భవిష్యత్తుకు అండగా ఏపీ ప్రభుత్వం

Next Story