Kurnool: పాస్ పుస్తకంపై సీఎం జగన్‌ ఫొటో.. రచ్చ రచ్చ చేసిన రైతు

by Disha Web Desk 16 |
Kurnool: పాస్ పుస్తకంపై సీఎం జగన్‌ ఫొటో.. రచ్చ రచ్చ చేసిన రైతు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘నా పాస్‌ పుస్తకంపై సీఎం జగన్‌ ఫొటో ఎందుకు?’ అంటూ ఓ రైతు తహసీల్డార్ కార్యాలయంలో అధికారులను నిలదీసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కర్నూలు జిల్లా చిరుమాన్ దొడ్డి గ్రామానికి చెందిన పీరాసాహెబ్ అనే రైతు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. తన పాత పట్టాదారు పాస్ పుస్తకం తొలగించి కొత్త పుస్తకం అట్టపై ముఖ్యమంత్రి జగన్ ఫోటో ఎందుకు పెట్టారు? అంటూ అధికారులను నిలదీశాడు.

భూమి తనదైతే సీఎం జగన్ ఫోటో ఎందుకు వేశారని.. పుస్తకంలో కూడా రికార్డులు తప్పులు తడకలుగా నమోదు చేశారంటూ రైతు పాస్ పుస్తకాన్ని టేబుల్‌పై విసిరి ఆగ్రహం వ్యక్తం చేశాడు. గ్రామంలో 122వ సర్వే నెంబర్‌లో తనకు ఆరు ఎకరాల 62 సెంట్లు భూమి ఉందని పాత పుస్తకంలో ఈ వివరాలు ఉన్నాయన్నాడు. కొత్త పాస్ పుస్తకంలో మాత్రం 6 ఎకరాల 61 సెంట్లు ఉందని నమోదు చేసి ఇవ్వడం ఏంటని అధికారులను కడిగి పారేశారు.

తనకు అన్యాయం జరిగిందని డిప్యూటీ తహసీల్దార్ ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. పాస్ పుస్తకంపై జగన్ ఫోటో ఎందుకు వేశారంటూ ప్రశ్నించిన రైతుకు సమాధానం చెప్పలేని అధికారులు నీళ్లు నమిలారు. అయితే ఈ విషయాన్ని తహసీల్దారును అడుగుతామంటే ఆయన గదిలోకి అనుమతించడంలేదని రైతు ఆరోపించాడు. అందుకే డిప్యూటీ తహసీల్దార్ వద్దకు వచ్చానంటూ రైతు పాస్ పుస్తకాన్ని విసిరేసాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి:

రెండు రోజుల్లో ఏపీకి కూల్ న్యూస్

Next Story

Most Viewed