శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం..

by Disha Web Desk 3 |
శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం..
X

దిశ, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వేడుక‌ అంగరంగవైభవంగా జ‌రిగింది. ఈ నెల 9వ తేదీన రానున్న ఉగాది పండుగ సందర్భంగా ఈ రోజు ఉదయం 6 గంటలకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా ఈ శుద్ధి కార్యక్రమాన్ని నాలుగు గంటల పాటు నిర్వహించారు. శుద్ధి కార్యక్రమం అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.

ఇక ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న టీటీడీ ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ఆల‌యం వెలుప‌ల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంవత్సరానికి నాలుగు సార్లు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్ళవర్ తిరుమంజనం జరుగుతుందని తెలిపారు. రానున్న ఉగాది పండుగ సందర్భంగా ఉద్యోగస్తులు,అధికారులు అందరూ కూడా కోయిల్ ఆళ్ళవర్ తిరుమంజనంలో స్వామివారితో కలిసి పాలుకొనడం జరిగిందని పేర్కొన్నారు .

అందులో తాను కూడా పాలుకొనడం చాలా ఆనందయకం అన్నారు. ముందుగా గ‌ర్భాల‌యం, ఉప ఆల‌యాల గోడ‌ల‌కు ముప్పు వాటిల్ల‌కుండా సుగంధ‌భ‌రిత‌మైన ప‌రిమ‌ళ ద్ర‌వ్యాల‌తో ప్రోక్ష‌ణం చేసిన‌ట్టు తెలిపారు. కాగా, వేకువజామున స్వామివారికి తిరుప్పావై నివేదించిన‌ ఆనంతరం శ్రీవారి మూలవిరాట్టును పట్టు పరదాతో కప్పి వేసినట్లు తెలిపారు.

అనంతరం ఆనందనిలయం మొదలుకుని బంగారు వాకిలి వరకు, ఆలయంలోని ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు. శుద్ధి పూర్తి అయిన తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.

ఆలయశుద్ధి చేసిన అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అష్టదళ పాదపద్మారాధన సేవ రద్దయింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో లోక‌నాథం, విజివో నంద‌కిషోర్, పేష్కార్ శ్రీ‌హ‌రి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఎంపీ



Next Story

Most Viewed