స్నేహం కోసం.. పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ కొత్త ప్లాన్

by Dishafeatures2 |
స్నేహం కోసం.. పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ కొత్త ప్లాన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాజకీయం వేరు స్నేహం వేరు. అందుకే పార్టీలు వేరైనా చాలా మంది నాయకులు కలిసే ఉంటారు. ఇప్పుడు ఇదే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తావిస్తున్నారు. రాజకీయం వేరు స్నేహం వేరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తనకు అన్నలాంటోడు అంటూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తరచూ తాము కలుస్తూ ఉంటామని పవన్ అభిరుచులు తన అభిరుచులు దాదాపు ఒక్కటేనంటూ ప్రకటించేశారు. ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేతలు దండెత్తికొచ్చారు. లొట్టపీసు అంటూ పవన్ పై విమర్శల దాడి చేశారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వడాన్ని ఖండిస్తూ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే.

ఇలాంటి తరుణంలో అందులోనూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కడా లేని ప్రేమ ఒలకబోయడం ఆసక్తికరంగా మారింది. పవన్‌పై కేటీఆర్ ప్రేమ వెనుక రాజకీయ కోణం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఏపీలో చేరువయ్యేందుకు పవన్ కల్యాణ్‌ను వారధిగా వాడుకునే ఎత్తుగడలో భాగంగానే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతుంది. జనసేన, బీజేపీల మధ్య చెడిందనే వార్తల ప్రచారం జరుగుతుంది. ఇదే తరుణంలో ఏపీలో బీఆర్ఎస్ బలపడాలని వ్యూహరచన చేస్తోంది. ఒకవేళ బీజేపీతో పవన్ కల్యాణ్ విడిపోతే బీఆర్ఎస్ స్నేహ హస్తం అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్‌పై ఎక్కడా లేని ప్రేమ ఒళకబోస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఏపీలో పోటీ చేస్తాం

2024 ఎన్నికల్లో ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ప్రకటించారు. ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో కొట్లాడతారని...కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీతో సత్సంబంధాలు కలిగి ఉంటారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని వ్యతిరేకించే గొంతు బీఆర్‌ఎస్‌ మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను కాపాడగలరని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రజలు కూడా ఇది నమ్మితే ఏపీ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అని అన్నారు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ కీలకం కావాలన్నదే తమ ఆలోచన అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. బీజేపీని ఓడించే పార్టీ బీఆర్‌ఎస్‌ మాత్రమేనన్న కేటీఆర్...ప్రధాని మోడీ ముక్కుపిండైనా సరే తమ హక్కులు సాధించుకుంటాం అని చెప్పుకొచ్చారు. బీజేపీపై కేసీఆర్ ఫైట్ చేసి తీరతారన్నారు. ఎందుకంటే కుమ్మక్కు రాజకీయాలు, లాలూచీ రాజకీయాలు తమకు చేతకావని కేటీఆర్ అన్నారు. బతికినన్ని రోజులు కొట్లాడుతూనే ఉంటాం. అది మోడీ అయినా.. మరెవరైనా. భయపడే ప్రసక్తే లేదు. లొంగిపోయే ప్రసక్తే లేదు. లాలూచీ పడేదే లేదు అంటూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

పవన్ అన్నలాంటోడు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు. ఒక అన్నలాంటి వాడు అని అన్నారు. పవన్ కల్యాణ్‌ను తాను చాలాసార్లు కలిశానని అనేక అంశాలపై చర్చించుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఒక ప్రముఖ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో ఏపీ పాలిటిక్స్, ఏపీలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పవన్ కల్యాణ్ అభిరుచులు తన అభిరుచులు అనేక సందర్భాల్లో కలిసినట్లు చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్‌కు సాహిత్యం అంటే ఇష్టం...అలాగే తనకు కూడా ఇష్టం అని చెప్పుకొచ్చారు. తమ స్నేహానికి రాజకీయాలకు సంబంధంలేదన్నారు. రాజకీయం రాజకీయమే..స్నేహ బంధం స్నేహ బంధమేనని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయం మాది...పవన్ కల్యాణ్ రాజకీయం పవన్ వి అని చెప్పుకొచ్చారు.

అయితే రాజకీయాలు, స్నేహానికి సంబంధం లేదు. ఎవరి రాజకీయాలు వారివి. ఆయన రాజకీయాలు ఆయనివి. నా రాజకీయాలు నావి అంటూ పవన్ కల్యాణ్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తోనూ మంచి సంబంధాలు ఉన్నాయి అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. లోకేశ్ తనకు బాగా తెలుసునన్నారు. ఇదే సందర్భంలో జగనన్న కూడా తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు. ఏపీలో అందరూ తనకు స్నేహితులేనని ఎవరితోనూ తనకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పుకొచ్చారు. అయితే రాజకీయాలకు..స్నేహలకు సంబంధం లేదంటూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ మాటల మతలబు

ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అత్యధికంగా పవన్ కల్యాణ్ గురించే మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ బంధం వెనుక రాజకీయ కోణం కూడా ఉందనే ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా కనుమరుగైపోయింది. ఇక టీడీపీ ఉన్నా లేనట్లే. టీడీపీ బలోపేతం అవ్వడం అసాధ్యమని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇకపోతే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఫాలోవర్స్ అత్యధికంగా ఉన్నారు. పవన్ కల్యాణ్ అభిమానుల ఓటు బ్యాంకు కోసం కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు, అనంతరం జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడంలో పవన్ కల్యాణ్ సహాయ సహకారాలు ఉన్నమాట వాస్తవం. బీజేపీతో పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతుగా నిలిచారు.

దీంతో జనసైనికులు గత ఎన్నికల్లో బీజేపీకీ మద్దతుగా నిలిచారు. అయితే పవన్ కల్యాణ్ బీజేపీ అగ్రనాయకత్వంపై అంత ఇష్టంగా లేరని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకవేళ పవన్ కల్యాణ్‌కు బీజేపీతో చెడితే ఖచ్చితంగా జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ వైపు చూస్తారని కేటీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు పుంజుకుంటున్నాయి. అదే క్రమంలో బీఎస్పీకి కూడా మేము సైతం అంటూ పట్టు బిగిస్తుంది. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ వ్యతిరేక ఓటును ఇతర పార్టీలకు వెళ్లకుండా ఉండేందుకు.. జనసేన ఓటు బ్యాంకును క్యాష్ చేసుకునే క్రమంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరుగుతుంది.

కాపు కోసమే ఈ ప్రేమ

ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఏపీలో వచ్చే ఎన్నికల్లో కాపు ఓటర్లు కీలకంగా మారనున్నారు. కాపు సామాజిక వర్గం ఓటర్లను దగ్గర చేసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆ రాష్ట్ర అధ్యక్షుడుగా కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్‌ను నియమించింది. తోట చంద్రశేఖర్ కాపు సామాజిక వర్గంలోని కీలక నేతలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునే పనిలో పడిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉందని భావిస్తున్న సీఎం కేసీఆర్ వారిని దగ్గరకు చేర్చుకునేందుకు ప్లాన్స్ వేస్తున్నారు. కాపులకు భవనాలు కేటాయిస్తూ ఇటీవలే సీఎం జగన్ హామీ ఇచ్చారు. అంతేకాదు ఏపీలో కాపు అభ్యర్థిని సీఎం అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా కాపులకుదగ్గరయ్యేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది రేపు ఏపీలో కలిసి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది.

ఇకపోతే బీజేపీతో పవన్ కల్యాణ్‌కు చెడితే ఏపీలో కూడా జనసేనతో కలిసి వెళ్తే బాగుంటుందనే యోచనలో బీఆర్ఎస్ ఉందా అనే అనుమానం కలుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి పరిస్థితిలో వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ సహకరించే పరిస్థితి లేదు. దీంతో బీఆర్ఎస్ ఆశలు ఒక్క జనసేనపైనే ఉందని అందుకే పవన్ కల్యాణ్‌పై ఎక్కడా లేని ప్రేమ ఒళకబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. లేకపోతే గతంలో పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, హరీశ్ రావు, మంత్రి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ వంటి నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఢీ అంటే డీ అన్నారు. అలాంటిది ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏకంగా పవన్ కల్యాణ్‌తో సత్సంబంధాలున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

బీఆర్ఎస్‌ను స్వాగతించిన పవన్

జనసేన అధినేత కూడా పవన్ కల్యాణ్ కూడా బీఆర్ఎస్ పార్టీని అంతగా విమర్శించిన దాఖలాలు లేవు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారడాన్ని పవన్ కల్యాణ్ స్వాగతించారు. టీఆర్ఎస్ జాతీయ వాదంతో బీఆర్ఎస్‌గా మారిందన్న పవన్ కల్యాణ్ దేశంలో ఎక్కడ నుంచైనా బీఆర్ఎస్ పోటీ చేయోచ్చు అని అన్నారు. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే తాను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇదే సందర్భంలో తెలంగాణలో జనసేన పాత్రను ప్రజలే నిర్ణయిస్తారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కూడా జనసేన తనవంతు పాత్రను పోషిస్తుందన్న పవన్ కల్యాణ్ పార్లమెంట్ ఎన్నికల్లో 7 నుంచి 14 స్థానాల్లో పోటీ చేస్తాం అని గతంలోనే పవన్ కల్యాణ్ ప్రకటించారు.

Read more : నలుగురిని పెళ్లి చేసుకుని నాలుగేళ్లకోసారి భార్యను మార్చలేం.. పవన్ పై సీఎం జగన్ సెటైర్లు



Next Story

Most Viewed