వైఎస్ వివేకా హత్యపై బీజేపీ నేత సంచలన ఆరోపణలు

by Disha Web Desk 7 |
వైఎస్ వివేకా హత్యపై బీజేపీ నేత సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీమంత్రి వైఎస్ వివేకా హత్యకేసు వెనుక మహాకుట్ర ఉందని మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ వివేకా హత్య సమయంలో వైఎస్ కుటుంబ సభ్యులు ఆదినారాయణరెడ్డిపైనా ఆరోపణలు చేశారు. అంతేకాదు సిట్, సీబీఐ ఎదుట విచారణకు సైతం ఆదినారాయణ రెడ్డి హాజరయ్యారు. అంతేకాదు ఈ హత్యకేసు విచారణను సీబీఐకు ఇవ్వాలని గట్టిగా పోరాడిన వారిలో ఆదినారాయణరెడ్డి సైతం ఉన్నారు.

వైఎస్ వివేకా హత్యకేసు విచారణ స్పీడు అందుకున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. పక్కా ప్లాన్ ప్రకారమే వైఎస్ వివేకాను హత్య చేశారని ఆరోపించారు. ఈ హత్యకేసుతో సంబంధం ఉన్న వాళ్లంతా బయటకు వస్తారని తెలిపారు. హత్య చేసి ఆధారాలు చెరిపేసేందుకు చేసిన ప్రయత్నాలు.. ముందస్తు బెయిల్ కోసం అపీల్‌కు వెళ్లడం వీటన్నింటి చిక్కుముడి త్వరలోనే వీడుతుందని మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

గొడ్డలి ఎక్కడ కొన్నారో తెలుసు?

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య వెనుక పెద్ద కుట్ర ఉందని ఈ విషయం సీబీఐకు కూడా తెలుసునని బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. నాడు తమపై లేనిపోని అభాండాలు వేశారని గుర్తు చేశారు. మనిషికి అసంతృప్తి ఉంటే ఎన్ని దారుణాలైనా చేస్తాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుతో సంబంధం ఉన్న వాళ్లందరూ బయటికొస్తారని చెప్పుకొచ్చారు.

ఈ హత్యకేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టు తప్పదన్నారు. అరెస్టు చేస్తారని భయపడే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారని చెప్పుకొచ్చారు. హత్యకు సంబంధించి కుక్కను ఎవరు చంపారు? గొడ్డలి ఎక్కడ కొన్నారో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. సీఐ వద్దంటున్నా ఇల్లు క్లీన్ చేశారు కుట్లు వేయడం,

ఇంటి చుట్టూ ఎవరు కెమికల్స్ చల్లించండం ఎవరి పనో అందరికీ తెలుసునన్నారు. ఇది తమ కుటుంబ సమస్య అని సీఐతో ఎంపీ అవినాశ్ రెడ్డి ఎందుకు వాగ్వాదం చేశారని నిలదీశారు. హత్య జరిగిన ప్రాంతంలో ఉండి అవినాశ్ రెడ్డి గుండెపోటు అన్నారని అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత ప్రొద్దుటూరు, కమలాపురం ఎమ్మెల్యేలు హత్య అని ఆరోపించారని గుర్తు చేశారు. ఈ కేసులో అవినాశ్ రెడ్డి నిందితుడు అని సీబీఐ చెప్తోందన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారని...అవినాశ్‌ను అరెస్టు చేస్తారని స్పష్టం చేశారు. ఒకే తప్పును రెండు మూడు సార్లు చెప్తే నిజం అవుతుందని సీఎం జగన్ పగటి కలలు కంటున్నారని ధ్వజమెత్తారు.

ఐదు కత్తిపోట్లు అని జగన్ ఎలా చెప్తారు?

సీఎం వైఎస్ జగన్‌పైనా మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీబీఐ విచారణకు పట్టుబడ్డ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ విచారణను ఎందుకు నిరాకరించారని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి ఉదయం చనిపోతే సాయంత్రం 4 గంటలకు జగన్ వచ్చారని చెప్పుకొచ్చారు. కప్‌బోర్డుకు రక్తం అంటిందని, ఐదు గొడ్డలి పోట్లు పడ్డాయని ఎలా చెప్పారని ఆదినారాయణ రెడ్డి నిలదీశారు.

హత్యకు ముందు వైఎస్ భాస్కర్ రెడ్డితో మాట్లాడి కథ అల్లేశారని చెప్పుకొచ్చారు. ఎవరు చెప్పారు ఇవన్నీ? చేసినోళ్లు, చేయించినోళ్లు మాట్లాడుకుని కథలు చెప్పారంటూ విరుచుకుపడ్డారు.ఉదయం 6.30 ఘటన గురించి బయటికి తెలిస్తే సినిమా అంతా అయిపోయాక అమాయకంగా వచ్చి సాయంత్రం తమపై నిందలు వేశారని చెప్పుకొచ్చారు.

లక్ష కోట్లు సంపాదించిన జగన్

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా లక్షల కోట్లు సంపాదించారని మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. ఎన్ని కోట్లు సంపాదించినా జగన్ ఇంకా అసంతృప్తితోనే రగిలిపోతున్నారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిగా ఇప్పటికే రూ.లక్ష కోట్లు సంపాదించారని ప్రస్తుతం టార్గెట్ రూ.10 లక్షల కోట్లు సంపాదించడమే జగన్ ధ్యేయమన్నారు. సీఎం పదవి వచ్చిందని తృప్తి జగన్‌కు లేదని... ప్రధాని కూడా కావాలనే ఆశ జగన్‌లో పుట్టిందని మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

లోకేశ్‌పై వైసీపీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డి ఫైర్

Next Story