AP | నిలిచిపోయిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్..

by Thanuru Gopichand |   (  Updated:2025-12-19 03:51:56  IST  )

విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో (Gannavaram Airport) పెను ప్రమాదం తప్పిందని తెలుస్తోంది.

AP | నిలిచిపోయిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్..
X

దిశ, వెబ్ డెస్క్ : విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో (Gannavaram Airport) పెను ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. గురువారం రాత్రి విశాఖపట్నం వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. వాస్తవానికి ఈ విమానం రాత్రి 7:30 గంటలకు హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకుని, తిరిగి రాత్రి 8 గంటలకు విశాఖపట్నం బయలుదేరాల్సి ఉంది. అయితే విమానం రన్‌వేపైకి వెళ్తున్న సమయంలో ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడినట్లు పైలట్ గుర్తించారు. అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని నిలిపివేసి, విషయాన్ని అధికారులకు తెలియజేశారు. అనంతరం విమానాన్ని సురక్షితంగా ఆప్రాన్‌కు తరలించారు. ఈ విమానంలో మొత్తం 165 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వైఎస్సార్‌సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్, కరణం ధర్మశ్రీ వంటి ప్రముఖులు ఉన్నారని సమాచారం.

​సాంకేతిక లోపం తీవ్రత దృష్ట్యా, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ యాజమాన్యం ఆ సర్వీసును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా ప్రముఖ నేతలు ఇతర కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉండటంతో ప్రయాణంలో జాప్యం జరిగిందని తెలియ వస్తోంది. విమాన సంస్థ సిబ్బంది ప్రయాణికులను విమానం నుంచి సురక్షితంగా దింపి లాంజ్ కు తరలించారు. లోపాన్ని సరిదిద్దేందుకు సాంకేతిక బృందం రంగంలోకి దిగింది. పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెద్ద ముప్పు తప్పిందని, ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే పనిలో ఎయిర్ లైన్స్ అధికారులు నిమగ్నమయ్యారు.

Read More..

ఇంజిన్‌లో సాంకేతిక లోపం.. ఆలస్యంగా నడుస్తున్న కాచిగూడ-మురుడేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్

Next Story