బిగ్ న్యూస్ : రంగంలోకి దిగిన అమిత్ షా.. కేసీఆర్‌కు మాస్టర్ స్ట్రోక్ తప్పదా..?

by  |
బిగ్ న్యూస్ : రంగంలోకి దిగిన అమిత్ షా.. కేసీఆర్‌కు మాస్టర్ స్ట్రోక్ తప్పదా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎప్పుడైనా ముందస్తుకు వెళ్లొచ్చని, నేతలంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా బీజేపీ రాష్ట్ర నేతలకు సూచించారు. పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలో బుధవారం బీజేపీ రాష్ట్ర నేతలంతా అమిత్​షాతో భేటీ అయ్యారు. నేతలంతా వారి వారి నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజా సమస్యలపై ఫోకస్​పెట్టాలని, టీఆర్‌ఎస్​వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. కేసీఆర్ ముందస్తుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తున్నదని, ఈ మేరకు సంకేతాలిస్తున్నారని పేర్కొన్నారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు టీఆర్ఎస్​ విశ్వప్రయత్నాలు చేస్తున్నదని అన్నారు.

దాదాపు 40కి పైగా స్థానాల్లో సిట్టింగులను మార్చే యోచనలో కేసీఆర్ ఉన్నారని చెప్పారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తొలగించేందుకు ఈ ఫార్ములాను ఎంచుకునే చాన్స్ ఉన్నదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఏడేళ్లుగా హామీలిస్తూ నెరవేర్చని పథకాలపై ప్రశ్నించాలని, వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. టీఆర్‌ఎస్​దూకుడుకు కళ్లెం వేయాలని సూచించారు. అదే స్థాయిలో బీజీపీ నేతలు దూకుడును పెంచాలన్నారు. కేసీఆర్​ అవినీతిని ఆధారాలతో ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని చెప్పారు. వడ్ల కొనుగోలు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి కేంద్రాన్ని దోషిగా నిలిపేందుకు టీఆర్ఎస్​ప్రయత్నిస్తున్నదని, గ్రామస్థాయికి అసలు విషయాలు చేరేలా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు.

వడ్ల కొనుగోళ్ల విషయంలో రికార్డుల్లోని అక్రమాలను వెలికితీయాలని, రైస్​మిల్లర్లకు లాభం చేకూర్చాలని పెద్ద కుంభకోణాన్ని కేసీఆర్ ​ప్రభుత్వం చేసిందని, వాటిని ప్రజలకు వివరించాలని చెప్పారు. కేడర్​మొత్తం ఇప్పటి నుంచే అలర్ట్ ​కావాలన్నారు. అలా చేస్తేనే తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణంతోపాటు రాష్ట్రంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని బయట పెట్టాలని రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్ షా సూచించారు. బీజేపీ నేతల పర్యటనల సందర్భంగా టీఆర్ఎస్​ నేతలు చేసే దాడులు.. పోలీసులు చేసే ఓవరాక్షన్ ​చూసి బెదిరిపోవద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని, ఎలాంటి భేషజాలు లేకుండా నేతలంతా సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు.

బండితో ప్రత్యేక భేటీ..

కేంద్ర హోంమంత్రి అమిత్​షా.. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌తో దాదాపు 10 నిమిషాలకు పైగా ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వంపై ఫైట్​చేయాలని సూచించినట్లు సమాచారం. పాదయాత్ర విషయమై చర్చ జరిగినట్టు తెలిసింది. మొదటి విడత పాదయాత్ర సక్సెస్ ఫుల్‌గా పూర్తిచేసిన బండిని అమిత్​షా అభినందించినట్లు బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. సెకండ్​ ఫేజ్ యాత్ర చేపట్టాలని సూచించారు. ఢిల్లీ నుంచి వచ్చాక రెండో విడత పాదయాత్ర ఏర్పాట్లపై చర్చించనున్నారు. బండి చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రతో ఆయనకు మాత్రమే మైలేజ్​వస్తున్నదని కొందరు నేతలు భావించినప్పటికీ అమిత్​షా ఈ విషయమై పలు సూచనలు చేయడం విశేషం.

ఈ యాత్ర వెనుక కేంద్రం మాస్టర్​ ప్లాన్​ ఉందని రాష్ట్ర అధిష్టానానికి ఒక క్లారిటీ వచ్చింది. దీంతో ప్రతీ ఒక్కరూ బండి సంజయ్‌కి మద్దతు తెలపాల్సిందే అనే సంకేతాలు ఇచ్చినట్లయింది. రెండో విడత యాత్ర ఈనెల చివరి వరకు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈనెల 27న బండి సంజయ్​ ఇందిరా పార్క్​వద్ద నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేలా ప్రణాళికలు చేస్తున్నారు.

ఫొటో ఆల్బమ్‌లతో గులాబీ నేతలు.. వారి జాతకం మారేనా..?


Next Story

Most Viewed