ఫొటో ఆల్బమ్‌లతో గులాబీ నేతలు.. వారి జాతకం మారేనా..?

by  |
TRS
X

దిశ, తెలంగాణ బ్యూరో : నామినేటెడ్ పదవుల కోసం ఆశావాహుల సంఖ్య ఎక్కువ అవుతోంది. ఉద్యమ కాలం నుంచి ఉన్నా ఏ పదవి రాకపోవడంతో ఇప్పుడైనా వస్తుందనే ఆశతో ఉన్నారు. తమ సన్నిహిత నాయకులను కలుస్తూ తాము చేపట్టిన కార్యక్రమాలతో ఆల్బమ్ తయారు చేసుకొని తెలంగాణ భవన్‌కు క్యూ కడుతున్నారు. నేతలను కలుస్తూ తమకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. అధినేత కేసీఆర్, కేటీఆర్‌లకు తమ గురించి చెప్పాలని ప్రాధేయపడుతున్నారు.

రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే రాష్ట్రంలోని సుమారు 90 కార్పొరేషన్లలో 13 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. దీంతో పార్టీ ఆవిర్భావం, ఉద్యమకాలం నుంచి కొనసాగుతున్న నేతల్లో ఆశలు చిగురించాయి. వీరితో పాటు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పలు పార్టీలకు చెందిన నేతలు చేరారు. ప్రస్తుతం వారంతా నామినేటెడ్ పదవులు వస్తాయనే ఆశతో ఎదురుచూస్తున్నారు. ఏళ్లతరబడి పార్టీలో పనిచేస్తున్నప్పటికీ అధిష్టానం గుర్తించడం లేదనే నిరాశతో ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు ఉండటంతో, పార్టీలో వ్యతిరేకత వస్తుందని దానిని రూపుమాపేందుకు పార్టీ అధినేత కేసీఆర్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియకు చర్యలు చేపట్టారు. దీంతో ఆశావాహుల సంఖ్య పెరిగింది.

అధిష్టానం దృష్టిలో పడేందుకు నామినేషన్ పదవులు ఆశిస్తున్న నేతలు తెలంగాణ భవన్, ప్రగతి భవన్‌ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. వచ్చిన నేతలను కలుస్తున్నారు. తనకు పదవి దక్కేలా చూడాలని విన్నవించుకుంటున్నారు. ఇదిలా ఉంటే అధిష్టానం సైతం పార్టీలో చురుగా పనిచేయడంతో పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో పాల్గొ్ంటున్న వారి వివరాలను సేకరిస్తోంది. దీనికి తోడు వారిని నియమిస్తే పార్టీకి ఓటు బ్యాంకు కలిసివస్తుందా అనేది కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏదీ ఏమైనప్పటికీ నామినేటెడ్ పదవుల కోసం నేతలు పడుతున్న పాట్లు అంతాఇంతాకాదు.

ఇదిలా ఉంటే పార్టీ కోసం పనిచేస్తున్నాను… తనకు పదవి ఇవ్వండి… ఎందుకు ఇవ్వరు.. అని అధిష్టానాన్ని అడిగేందుకు ఎవరూ సాహసించడం లేదు. ఎవరైనా తమకులం వారికి నామినేటెడ్ ఇవ్వాలని గానీ… ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టినా అతడికి నిరాశే. అంతేకాదు పాలాన వ్యక్తికి ఇవ్వాలని సూచించినా పార్టీలో అతడి స్థానం గల్లంతే. పార్టీ పదవి కావాలంటే వేచిచూడాలని… పార్టీకోసం పనిచేస్తూనే ఉండాలని అప్పుడే పదవులు వస్తాయని పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనే స్పష్టం చేయడం విశేషం. ఈ క్రమంలోనే పార్టీకోసం పనిచేస్తున్న వారికి సైతం నిరాశే ఎదురవుతుండటం, కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు వస్తుండటంతో నిరాశే ఎదురవుతుందని పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేయడంతో పాటు రాష్ట్ర కమిటీలో సైతం పనిచేసిన నేత అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే పార్టీలో ఎవరైనా… ఎంతటివారైనా సైలెంట్‌గా ఉండాల్సిందే. అధిష్టానం ఆశీస్సులు ఉంటే పదవి… లేకుంటే నిరాశే.



Next Story

Most Viewed