అనంతనాగ్-రాజౌరి పోలింగ్ తేదీలో మార్పు.. కారణం ఇదే..

by Dishanational5 |
అనంతనాగ్-రాజౌరి పోలింగ్ తేదీలో మార్పు.. కారణం ఇదే..
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరి లోక్‌సభ స్థానం పోలింగ్ తేదీని ఎన్నికల కమిషన్(ఈసీ) మే 7 నుంచి మే 25కి మార్చింది. దేశమంతా వాతావరణం వేడెక్కి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే జమ్మూ కశ్మీర్‌లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కశ్మీర్‌లో వర్షాలు, హిమపాతం సంభవించడంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలు, కొండ చరియలు విరిగిపడుతుండటంతో రహదారులు మూసివేస్తున్నారు. దీంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అనంతనాగ్-రాజౌరి స్థానానికి పోలింగ్ తేదీని మార్చాలంటూ కశ్మీర్ బీజేపీ యూనిట్ చీఫ్ రవిందర్ రైనా, జమ్మూ కశ్మీర్ అప్ని పార్టీ చీఫ్ అల్తాఫ్ బుఖారి, పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత ఇమ్రాన్ అన్సారీ సహా పలు పార్టీల నేతలు ఈసీని కోరారు. ఈ క్రమంలోనే ఈసీ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ స్థానానికి మూడో దశలో భాగంగా మే 7న పోలింగ్ జరగాల్సి ఉండగా, దాన్ని మే 25న జరగనున్న ఆరో దశకు మారుస్తున్నట్టు మంగళవారం వెల్లడించింది. కాగా, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు మాత్రం ఎన్నికల తేదీని మార్చొద్దంటూ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.


Next Story