తలకాయ ఉన్నోడు అలా మాట్లాడరు

by Sridhar Babu |
తలకాయ ఉన్నోడు అలా మాట్లాడరు
X

దిశ,తుంగతుర్తి : వరి ధాన్యంపై సీఎం చేసిన బోనస్ ప్రకటన తలకాయ ఉన్నోనికి అర్థమవుతుందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి తలకాయ లేనందువల్లే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. దొడ్డు వడ్లకు బదులు సన్న వడ్లు రైతులతో పెట్టించి ఆ ధాన్యాన్ని రేపు చౌక ధరల దుకాణాల ద్వారా ప్రజలకు అందించే దృక్పథంతో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. అందుకే సన్న వడ్లు పండించే రైతులకు రూ.500 బోనస్ ప్రకటించారని వివరించారు. నేడు ఎవరు కూడా దొడ్డు వడ్లు తినే పరిస్థితి లేదని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఉన్న దొంగలే తమ స్వలాభాల కోసం దొడ్డు వడ్ల పాట పాడుతున్నారని అన్నారు. దొడ్డు వడ్లను సన్న బియ్యంగా మార్చి అమ్ముకునే దొంగలని వారిపై దుమ్మెత్తి పోశారు.

రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తానంటే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఎన్ని ధర్నాలు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మకనే దూరం కొట్టారని అన్నారు. అమరుల త్యాగాలను గమనించే సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే కేసీఆర్ విధ్వంసం చేసి బ్రష్టు పట్టించారని అన్నారు. తెలంగాణ ఇచ్చిందనే విశ్వాసం తో ఏనాడు కూడా సోనియమ్మను రాష్ట్రానికి ఆహ్వానించలేదని పేర్కొన్నారు. మొదట్లో చేసుకున్న అగ్రిమెంట్ల ప్రకారం 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 2న ఇరు రాష్ట్రాల ఆస్తుల పంపకాలు పూర్తవుతాయని సామెల్ వివరించారు.

జూన్ 2న జరిగే కార్యక్రమాలకు ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకొని రాష్ట్రానికి సోనియమ్మను రప్పిస్తామని వివరించారు. ఇదిలా ఉంటే హరిహర బ్రహ్మర్థులు అడ్డొచ్చినప్పటికీ ఎంపీ, ఎమ్మెల్సీ అభ్యర్థులైన కిరణ్ కుమార్ రెడ్డి, తీన్మార్ మల్లన్న విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి 3,500 గృహాలు మంజూరు అయ్యాయని ఎన్నికల కోడ్ ముగిశాక అర్హులైన వారందరిని ఎంపిక చేస్తామని వివరించారు. కార్యక్రమంలో తుంగతుర్తి, తిరుమలగిరి, నాగారం, మద్దిరాల, నూతనకల్, మోత్కూర్, అడ్డగూడూరు, శాలిగౌరారం, జాజిరెడ్డిగూడెం మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed