మానేరు డ్యాం 12 గేట్లు ఎత్తివేత

by  |
Manair Dam
X

దిశ, కరీంనగర్ సిటీ : జిల్లాలో ముసురు ముసుగేసింది. బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం మూలంగా, ఆకాశానికి చిల్లులు పడ్డట్లుగా మారింది. జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షంతో చెరువులు, కుంటలు నిండి జలకళను సంతరించుకున్నాయి. పలు ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండగా, జిల్లాలోని మోయతుమ్మెద, మానేరు వాగులు ఉరకలెత్తుతున్నాయి. పై నుంచి వస్తున్న నీటితో దిగువ మానేరు జలాశయం ఇప్పటికే నిండుకుండలా మారింది.

పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం 5.30 గంటలకు జల వనరుల శాఖాధికారులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ఎల్ఎండీ గేట్లు ఎత్తారు. 12 గేట్లు ఎత్తి 2000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లోని రహదారులు తెగి రాకపోకలకు అంతరాయం కలిగింది.

మానకొండూర్, చిగురుమామిడి, శంకరపట్నం, గన్నేరువరం, చొప్పదండి, తిమ్మాపూర్, హుజురాబాద్, వెంకేపల్లి సైదాపూర్, రామడుగు మండలాలతో పాటు నగరంలో 35 నుంచి 45 మీ.మీ. వర్షం కురిసింది. మరో మూడు రోజులు వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంటుండగా, నగరపాలక సంస్థ ముందస్తు చర్యలు చేపట్టడంలో నిమగ్నమైంది.

టెన్షన్ టెన్షన్ : వేములవాడ బ్రిడ్జి ఉంటుందా.. మళ్లీ ఊడుతుందా..?

Manair-water



Next Story

Most Viewed